మలాసనం యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యానికి బూస్ట్
ABN , Publish Date - May 21 , 2026 | 07:39 AM
ఉదయం ఖాళీ కడుపుతో మలాసనం (స్క్వాట్ పోజ్) చేయడం వల్ల శరీరానికి, మనసుకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ యోగా ఆసనం జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు వెన్నెముకను బలపరచడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యంగా ఉండటానికి మలాసనం చాలా సులభమైన, ప్రభావవంతమైన యోగా ఆసనం. దీన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల శ్వాస, శరీరం మధ్య సమన్వయం మెరుగవుతుంది. దీంతో మనసు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. ఇది తుంటి కండరాలను బలపరుస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో మలాసనం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మలాసనం ఆరోగ్య ప్రయోజనాలు!
ఉదయం ఖాళీ కడుపుతో మలాసనం చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా మారుతుంది. రోజంతా శరీరం ఉత్సాహంగా ఉంటుంది.
మలాసనం శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. మనసులో స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, భద్రతా భావాన్ని పెంచుతుంది. ఏకాగ్రతను కూడా మెరుగుపరుస్తుంది.
శారీరకంగా చూస్తే ఈ ఆసనం తొడలు, పిక్కలు, తుంటి కండరాలను బలపరుస్తుంది. అలాగే నడుము, నడుము కింది భాగం, చీలమండలలో ఉన్న బిగుతును తగ్గిస్తుంది. ఎక్కువసేపు కూర్చుని పని చేసే వారికి ఇది చాలా ఉపయోగకరం.
ఈ ఆసనం గర్భిణీలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది కటివలయ కండరాలను బలపరుస్తుంది. అయితే గర్భధారణ సమయంలో ఏ యోగా చేయాలన్నా ముందుగా వైద్యులని సంప్రదించడం అవసరం.
మోకాళ్లు, చీలమండలు లేదా నడుము కింది భాగంలో తీవ్రమైన నొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయకూడదు. అలాగే ఇటీవల పొత్తికడుపు లేదా తుంటి శస్త్రచికిత్స చేయించుకున్నవారు కూడా ఈ ఆసనం చేయడం మంచిది కాదు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
రోజూ 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఫర్నిచర్కు చెదలు పట్టిందా? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి