రాగి బాటిల్లో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు
ABN , Publish Date - May 18 , 2026 | 10:11 AM
రాగి బాటిల్లో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే. అయితే, దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రాగి బాటిల్లో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది భావిస్తారు. అందుకే రోజూ రాగి బాటిల్ లేదా గ్లాసులో నీళ్లు తాగుతారు. కొంతమంది రాత్రంతా రాగి పాత్రలో నీటిని ఉంచి, ఉదయం పరగడుపున తాగుతారు. ఇలా తాగడం వల్ల జీర్ణక్రియ బాగా పని చేయడం, రోగనిరోధక శక్తి పెరగడం వంటి ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు.
అయితే, రాగి బాటిల్ను సరైన విధంగా ఉపయోగించకపోతే ఆరోగ్య సమస్యలు రావచ్చు. కొన్ని తప్పుల వల్ల శరీరంలో రాగి మోతాదు ఎక్కువై వికారం, కడుపు సమస్యలు వంటి ఇబ్బందులు కలగొచ్చు. అందుకే రాగి నీరు తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
నిమ్మరసం వంటి పదార్థాలు కలపొద్దు
చాలామంది రాగి బాటిల్లోని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు. నిమ్మకాయలో ఉండే ఆమ్లం రాగితో కలిస్తే ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది. దీంతో వికారం, వాంతులు, కడుపు అసౌకర్యం వంటి సమస్యలు రావచ్చు.
చాలా వేడి లేదా చాలా చల్లని నీళ్లు పోయొద్దు
రాగి బాటిల్లో చాలా వేడి నీళ్లు లేదా చాలా చల్లని నీళ్లు పోయకూడదు. ఇలా చేయడం వల్ల రాగి గుణాలు మారే అవకాశం ఉంటుంది. అందుకే సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీటినే రాగి బాటిల్లో నిల్వ చేయడం మంచిది.
రోజంతా రాగి నీళ్లు తాగొద్దు
రోజంతా రాగి బాటిల్ లోని నీటినే తాగడం కూడా మంచిది కాదు. ఎక్కువగా రాగి నీరు తాగితే శరీరంలో రాగి మోతాదు పెరిగి వికారం, వాంతులు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఎంత తాగాలి?
రాత్రి రాగి పాత్రలో నీటిని ఉంచి, ఉదయం కొద్దిగా తాగితే సరిపోతుంది. రోజుకు 250 నుంచి 500 మిల్లీలీటర్ల వరకు మాత్రమే రాగి నీరు తాగడం మంచిది. ఎక్కువగా తాగితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
బంగాళదుంపలు త్వరగా ఉడకాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి
మా ప్లేయర్ల పరువుకు భంగం కలిగిస్తే సహించేది లేదు: ప్రీతి జింటా
For More Latest News