ఎంబీబీఎస్ కోర్సు వ్యవధిపై ఎన్ఎంసీ కీలక ప్రతిపాదన
ABN , Publish Date - May 31 , 2026 | 02:06 PM
ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట కలిగించేలా జాతీయ వైద్య కమిషన్ (NMC) కీలక ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం 9 సంవత్సరాలుగా ఉన్న MBBS కోర్సు పూర్తి గడువును 10 సంవత్సరాలకు పెంచాలని ముసాయిదా నోటిఫికేషన్లో సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎంబీబీఎస్ (MBBS) కోర్సు పూర్తి చేసేందుకు విద్యార్థులకు మరింత వెసులుబాటు కల్పించే దిశగా జాతీయ వైద్య కమిషన్ (NMC) కీలక ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ కోర్సును, తప్పనిసరి రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్తో (CRMI) కలిపి 9 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉండగా, ఆ గడువును 10 సంవత్సరాలకు పెంచాలని NMC ప్రతిపాదించింది.
ఈ మేరకు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్-2023లో సవరణలు చేస్తూ NMC ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, విద్యార్థులు తమ వైద్య విద్యను పూర్తి చేసేందుకు అదనంగా మరో ఏడాది సమయం పొందనున్నారు. ప్రస్తుతం విద్యార్థులు MBBSలో ప్రవేశం పొందిన తేదీ నుంచి 9 సంవత్సరాల లోపు కోర్సు, ఇంటర్న్షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. తాజా ప్రతిపాదన ప్రకారం ఈ గడువు 10 సంవత్సరాలకు పెరగనుంది. అయితే, మొదటి ప్రొఫెషనల్ MBBS పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రస్తుతం ఉన్న గరిష్టంగా నాలుగు ప్రయత్నాల నిబంధనలో ఎలాంటి మార్పు ఉండదని NMC స్పష్టం చేసింది.
భాగస్వాముల అభిప్రాయాలకు ఆహ్వానం
ఈ సవరణను తుది నిర్ణయానికి తీసుకెళ్లే ముందు విద్యార్థులు, వైద్య విద్యాసంస్థలు, ఇతర భాగస్వాముల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు NMC వెల్లడించింది. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది.
విద్యార్థులకు అదనపు వెసులుబాటు
ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, వ్యక్తిగత లేదా విద్యా కారణాల వల్ల కోర్సు పూర్తి చేయడంలో ఆలస్యం ఎదుర్కొనే విద్యార్థులకు అదనపు సమయం లభిస్తుంది. ముఖ్యంగా తప్పనిసరి రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ను కూడా ఈ 10 ఏళ్ల వ్యవధిలోనే పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. వైద్య విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని NMC తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనపై ఇప్పుడు వైద్య విద్యా వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
బ్రో... జాగ్రత్త..! సోషల్ మీడియాలో రెచ్చగొడితే జైలుకే
15 ఏళ్లు దాటిన పురుషుల్లో 44శాతం మద్యం ప్రియులే
Read Latest Latest News