Share News

యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌పై నూజివీడులో మరో ఫిర్యాదు

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:20 AM

ఏలూరు జిల్లాలోని నూజివీడులో యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌పై మరో కేసు నమోదైంది. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు పెట్టిన నేపథ్యంలో జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు..

యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌పై నూజివీడులో మరో ఫిర్యాదు
Joseph Ravan

ఏలూరు, జులై 10: జిల్లాలోని నూజివీడులో యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌పై పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని సదరు యూట్యూబర్ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితం కాకుండా, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ద్వేషభావాన్ని, వ్యతిరేకతను రెచ్చగొట్టేలా జోసఫ్ రావణ్ కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్న సదరు యూట్యూబర్‌పై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు నూజివీడు పోలీసులను కోరారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేసి, నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


రావణ్ నివాసంలో రెండో రోజు ఏపీ పోలీసుల సోదాలు..

వివాదాస్పద వ్యాఖ్యల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జోసెఫ్ రావణ్ అలియాస్ ‘ప్రశ్న రావణ్’ నివాసంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వరుసగా రెండో రోజు విస్తృత సోదాలు నిర్వహించారు. గన్నవరం పోలీసుల ప్రత్యేక బృందం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని నరేంద్రనగర్ కాలనీలో గల ఆయన ఫ్లాట్‌కు చేరుకుని తనిఖీలు చేపట్టింది. క్రితం రోజు దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ తనిఖీలలో భాగంగా పోలీసులు కొన్ని కీలక దస్త్రాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ప్రక్రియ అంతటా పారదర్శకత కోసం పోలీసులు ఇంటి తనిఖీలను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా వీడియో రికార్డింగ్ చేశారు. ఈ తనిఖీల సమయంలో దర్యాప్తు బృందం రావణ్ భార్యను సుదీర్ఘంగా ప్రశ్నించి, కేసులకు సంబంధించిన పలు కీలక వివరాలను సేకరించింది. ఆ వివరాలన్నింటినీ అధికారులు తమ ల్యాప్‌టాప్‌లో భద్రపరిచారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారానికి సంబంధించి పలు పత్రాలపై రావణ్ భార్య సంతకాలను కూడా తీసుకున్నారు. స్థానిక అమీన్‌పూర్ పోలీసుల గట్టి బందోబస్తు నడుమ సాగిన ఈ సోదాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.


ఇవి కూడా చదవండి...

ఎక్కడ ‘సర్‌’.. మీ చిరునామా?

అరుదైన మైలురాయిని అందుకున్న అక్షర్ పటేల్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 10 , 2026 | 12:20 PM