సింహాచలం కొండ దిగువన గుర్తుతెలియని వ్యక్తుల ఘాతుకం
ABN , Publish Date - Mar 27 , 2026 | 09:35 AM
సింహాచలం కొండ దిగువన విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సూపర్వైజర్పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
విశాఖపట్నం, మార్చి 27: సింహాచలంలో దారుణం చోటు చేసుకుంది. సింహాచలం కొండపై శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద సెక్యూరిటీ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణరావుపై ముసుగు ధరించిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. కొండ దిగువన ఉన్న ఆలయ ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. కర్రలతో లక్ష్మణరావు ముఖం, తలపై బలంగా కొట్టడంతో.. అతని దవడ ఎముక విరిగి తీవ్ర రక్తస్రావం అయింది. తీవ్ర గాయాలపాలైన లక్ష్మణరావును స్థానికులు వెంటనే గోపాలపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
గత పదేళ్లుగా సింహాచలం ఆలయంలో సెక్యూరిటీగార్డుగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణరావుపై రెండేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో దాడి జరిగినట్లు తెలుస్తోంది. తమ కుటుంబానికి ఆధారం తండ్రి మాత్రమేనని.. దేవస్థానం అధికారులు స్పందించి ఆదుకోవాలని బాధితుడి కుమారుడు వేడుకున్నారు. విషయం తెలిసిన వెంటనే గోపాలపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మణరావుపై గంజాయి గ్యాంగ్ దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వరుసగా దాడులు జరుగుతున్నా దేవస్థానం అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంపై ఆలయ సిబ్బందిలో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఇవి కూడా చదవండి...
ఇక డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం.. ప్రకటించిన యూఎస్ ట్రెజరీ సెక్రటరీ
శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
Read Latest AP News And Telugu News