‘నైరుతి’ మూడో నెలలోనూ నిరాశే
ABN , Publish Date - Aug 31 , 2026 | 04:11 AM
నైరుతి రుతుపవనాల సీజన్లో మొదటి మూడు నెలల కాలం సోమవారంతో పూర్తికానుంది. ఈ 3 నెలల కాలంలో రాష్ట్రంలో పట్టుమని వారం రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురవలేదు.
మూడో నెలలోనూ నిరాశే
రాష్ట్రంలో 53శాతం వర్షపాతం లోటు
అన్ని జిల్లాల్లోనూ వర్షాభావమే
2002 ఎల్నినో కంటే ఘోరం
అన్నదాతల ఆశలన్నీ సెప్టెంబరుపైనే
‘నైరుతి’ మూడు నెలల్లో
రాష్ట్రంలో 53 శాతం వర్షపాతం లోటు
అన్ని జిల్లాల్లోనూ వర్షాభావమే
2002 ఎల్నినో కంటే ఘోరం
అన్నదాతల ఆశలన్నీ సెప్టెంబరుపైనే
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నైరుతి రుతుపవనాల సీజన్లో మొదటి మూడు నెలల కాలం సోమవారంతో పూర్తికానుంది. ఈ 3 నెలల కాలంలో రాష్ట్రంలో పట్టుమని వారం రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురవలేదు. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరదతో కొన్ని రిజర్వాయర్లలోకి నీరు చేరిందే తప్ప... వాగుల్లో నీటి ప్రవాహం లేదు. చెరువుల్లో చుక్క వర్షం నీరు చేరలేదు. జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు రాష్ట్రంలో 418.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 196.7 మి.మీ. (సాధారణం కంటే 53 శాతం తక్కువ) మాత్రమే వర్షం కురిసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాభావం కొనసాగింది. దేశంలో బిహార్ తర్వాత ఏపీలోనే అత్యధికంగా వర్షాభావం నెలకొంది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రికార్డుల మేరకు 1970 తర్వాత 1997, 2002, 2009, 2015, 2023 సంవత్సరాలలో తీవ్రమైన ఎల్నినోలు నమోదు కాగా, వాటిలో 2002ను అత్యంత దుర్భిక్షమైన సంవత్సరంగా నిపుణులు విశ్లేషించారు. ఆ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో ఏపీలో 26 శాతం లోటు వర్షపాతం నమోదవగా, ప్రస్తుత ఏడాది అంతకుమించి వర్షాభావం నెలకొంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఏ ఒక్క జిల్లాలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పసిఫిక్ మహాసముద్రం నుంచి వీచే రుతుపవనగాలులు భారతదేశం వైపు రాకుండా దక్షిణ చైనా వైపు వెళ్లడంతో దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ వర్షాభావానికి గురయ్యాయని రిటైర్డు వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల కోస్తాంధ్రలో కొద్దిపాటి వర్షం కురుస్తున్నదే తప్ప వాగులు పొంగి, చెరువులు నిండేటంత వర్షాలు పడడం లేదు.
ఈ నేపథ్యంలో సెప్టెంబరుపైనే రైతులు గంపడాశ పెట్టుకున్నారు. సెప్టెంబరు రెండో వారంలో రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమవుతుంది. గత కొన్ని సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే.. సెప్టెంబరులో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. అయితే బలమైన ఎల్నినో కొనసాగుతున్నందున ఈ ఏడాది సెప్టెంబరులో వర్షాలు పెరుగుతాయా? లేదా వర్షాభావం కొనసాగుతుందా? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుతుపవనాల నిష్క్రమణ సమయంలో రుతుపవనద్రోణి ఉత్తరాది నుంచి దక్షిణాది వైపుగా రానున్న నేపథ్యంలో వర్షాలు పెరుగుతాయని కొందరు నిపుణులు అంచనావేస్తున్నారు. దీంతో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు కొంత మేలు చేస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..
ఇదిలావుండగా శనివారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ను ఆనుకుని కొనసాగుతున్నది. ఇది సోమవారానికి పశ్చిమ వాయవ్యంగా పయనించి ఝార్ఖండ్వైపు వెళ్లనుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభాంతో ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి