ఇసుకను తోడేస్తున్నారు!

ABN , First Publish Date - 2022-12-10T00:16:44+05:30 IST

గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద ఇసుక అక్రమ తవ్వకాలు మళ్లీ ఊపందుకున్నాయి. మల్లవరం సమీపంలో ఇష్టానుసారం తోడేస్తున్నారు. రాత్రుళ్లు గుట్టుచప్పుడు కాకుండా లారీలు, ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ఇప్పటి వరకు స్థానిక అవసరాల కోసం ప్రజలు టైరు బండ్లతో ఇసుకను తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతించేవారు.

ఇసుకను తోడేస్తున్నారు!

రాత్రి వేళల్లో లారీల్లో తరలింపు

ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు

కన్నెత్తిచూడని అధికారులు

మద్దిపాడు, డిసెంబరు 9 : గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద ఇసుక అక్రమ తవ్వకాలు మళ్లీ ఊపందుకున్నాయి. మల్లవరం సమీపంలో ఇష్టానుసారం తోడేస్తున్నారు. రాత్రుళ్లు గుట్టుచప్పుడు కాకుండా లారీలు, ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ఇప్పటి వరకు స్థానిక అవసరాల కోసం ప్రజలు టైరు బండ్లతో ఇసుకను తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతించేవారు. ఇటీవల గ్రామాల్లో జగనన్న కాలనీల నిర్మాణాలు ప్రారంభంకావటంతో ఇసుకకు డిమాండ్‌ బాగా పెరిగింది. దీంతో వైసీపీ నాయకులు ఇసుక దందాకు తెరలేపారు. గుండ్లకమ్మలో ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రోజుకు ఇలా 50 నుంచి వంద లారీల ఇసుక బయటిప్రాంతాలకు వెళ్తోంది. దాన్ని అమ్ముకొంటున్న వైసీపీ నేతలు రూ.లక్షలు పోగేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. రెవెన్యు, పోలీసు అధికారులకు కూడా ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టుకు సమీపంలోనే ఇసుకను యంత్రాలతో విచ్చలవిడిగా తోడేస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇసుకతో భారీ వాహనాల రాకపోకల వలన రోడ్డు దెబ్బతిన్నదని వారు చెప్తున్నారు. ఇసుకను తోడేందుకు గుండ్లకమ్మ ప్రాజెక్టులోకి పెద్ద యంత్రాన్ని దించారు. ఎంత మంది చెప్పినా దాన్ని అక్కడి నుంచి తీయకపోవడాన్ని బట్టి చూస్తే అక్రమార్కులకు ఏస్థాయి అండదండలున్నాయో అర్థమవుతుంది.

ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు

లక్ష్మీనారాయణ, మద్దిపాడు తహసీల్దార్‌

గుండ్లకమ్మ ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రాజెక్టులో ఇసుక తవ్వకాలకు యంత్రాన్ని వాడుతున్న వారిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ఇసుక తరలించేందుకు ప్రభుత్వ అనుమతులు తప్పని సరి. అందుకు భిన్నంగా ఎవ్వరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదు.

Updated Date - 2022-12-10T00:16:46+05:30 IST