ఫ్లోర్, లిఫ్ట్కి మధ్యలో ఇరుక్కున్న మహిళ... చివరకు
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:48 PM
ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్, ఫ్లోర్ మధ్యలో ఇరుక్కుని 50 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రకాశం, ఆగస్టు 20: ఈ మధ్య కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు అనేకం చోటు చేసుకున్నాయి. లిఫ్ట్లో ఇరుక్కుని కొంతమంది సురక్షితంగా బయటపడగా, మరికొంత మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. తాజాగా ప్రకాశం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కూతురు, మనవడితో కలిసి లిఫ్ట్లో తమ ఫ్లోర్కు వెళ్లిన మహిళ.. లిఫ్ట్ ప్రమాదం బారిన పడి మృతిచెందారు. నిన్న(ఆదివారం) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒంగోలు మార్కెట్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో వినీత(50) అనే మహిళ.. కూతురు, మనవడితో కలిసి లిఫ్ట్ ఎక్కారు. తమ ఫ్లోర్ రాగానే ముందుగా కూతురు, మనవడు బయటకు రాగా.. ఆ వెనకే వినీత కూడా బయటకు వస్తున్న సమయంలో తలుపులు తెరిచి ఉండగానే లిఫ్ట్ కిందకు కదలింది. దీంతో భయాందోళనకు గురైన మహిళ.. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే లిఫ్ట్ కిందకు వెళ్లడంతో లిఫ్ట్, ఫోర్కు మధ్యలో ఇరుక్కుపోయారు.
వెంటనే గమనించిన కూతురు.. తన తల్లిని రక్షించేందుకు ప్రయత్నించారు. విషయం తెలియగానే అపార్ట్మెంట్ వాసులు, ఇతరులు అక్కడకు చేరుకుని వినీతను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఈ సంఘటన అపార్ట్మెంట్ భవనాల్లో లిఫ్ట్ భద్రత, నిర్వహణపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లిఫ్ట్కు అవసరమైన అన్ని భద్రత, నిర్వహణ తనిఖీలు జరిగాయా.. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్లో షహజాద్ భట్టీ నెట్వర్క్ జాడలు
క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని సమర్ధిస్తారా?
Read Latest AP News And Telugu News