నిందితులకు చీరాల పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్
ABN , Publish Date - Feb 04 , 2026 | 04:50 PM
స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన నిందితులకు చీరాల పోలీసులు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రేమ విషయంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
బాపట్ల, ఫిబ్రవరి 04: యువతలో నేర ప్రవృత్తి బాగా పెరుగుతోంది. దీనిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. నేరానికి పాల్పడిన నిందితులను కిలోమీటర్ల మేర పట్టపగలు నడి రోడ్డుపై నడిపించి.. పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్తున్నారు. ఈ తరహా ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల చీరాలలో యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు పాల్పడిన నిందితులకు పోలీసులు ఈ తరహా పద్దతినే అమలు చేశారు. నేరాలకు పాల్పడే వారికి ఈ తరహా చర్యలు తప్పవంటూ నేర ప్రవృత్తి ఉన్నవారికి చెప్పకనే చెప్పారు పోలీసులు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
జనవరి 27న చీరాల ఫ్లైఓవర్ వద్ద కొండే త్రినాథ్ (19) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడిని బీరు బాటిల్స్తో దారుణంగా పొడిచి.. బండరాయితో తలపై మోది హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా చీరాల ప్రాంతాల్లోని పలు సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
తమదైన శైలిలో వారిని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. ఓ యవతితో ప్రేమ వ్యవహారంలో త్రినాథ్ను షేక్ గౌస్ హత్య చేశాడు. అతడికి దేవ హర్ష, శీలం భగవంతుడు సహాయం చేసినట్లు అంగీకరించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు. నిందితులకు కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది.
బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కొండె వెంకటేశ్వర్లు, రాజేశ్వరి దంపతులకు రెండో కుమారుడు త్రినాథ్ (19). అతడు తన అన్నతో కలిసి చీరాలలోని నానామ్మ ఇంటి వద్ద ఉంటూ.. రోజు వారీ విద్యుత్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. త్రినాథ్, ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. ఆ యువతిని త్రినాథ్ స్నేహితుడు షేక్ గౌస్ సైతం ప్రేమిస్తున్నాడు. దాంతో త్రినాథ్పై షేక్ గౌస్ కక్ష పెంచుకున్నాడు. దాంతో స్నేహితుల సహాయంతో త్రినాథ్ను గౌస్ దారుణంగా హత్య చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉక్రెయిన్తో శాంతి చర్చలు.. దాడులు తీవ్రతరం చేసిన రష్యా..
For More AP News And Telugu News