Share News

ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం: నారా లోకేశ్

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:06 PM

2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే సీఎం చంద్రబాబు నాయుడి ప్రధాన విజన్ అని లోకేశ్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ధ్యేయంగా ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోందన్నారు.

ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం: నారా లోకేశ్
Nara Lokesh Highlights AP's Growth Vision, Jobs Target and Amaravati Development at Republic TV Summit 2026

న్యూఢిల్లీ, జూన్ 22: ఢిల్లీ వేదికగా జరిగిన 'రిపబ్లిక్ టీవీ సమిట్ 2026'లో ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొని రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర రూపురేఖలను మార్చేందుకు అత్యంత వేగంగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

సీఎం విజన్.. $2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ

2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రధాన విజన్ అని లోకేశ్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ధ్యేయంగా ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోందని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఏపీ '3S' (Speed, Stability, Service - స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) ఫార్ములాను అందిస్తోందని పేర్కొన్నారు.

'మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత వేగంగా పనులు పూర్తి కావాలని కోరుకునే ఒక 'స్పీడ్ బాస్'. ఆయన వేగానికి తగ్గట్టుగానే యంత్రాంగం పనిచేస్తోంది. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న మొత్తం విదేశీ పెట్టుబడులలో (FDI) 25 శాతం వాటా ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే వస్తుండటం మా ప్రభుత్వ సమర్థతకు నిదర్శనం' అని లోకేశ్ ప్రకటించారు.


రికార్డు కాలంలో ప్రాజెక్టుల పురోగతి

రాష్ట్రంలో పారిశ్రామిక అనుమతులు, భూ కేటాయింపులు ఎంత వేగంగా జరుగుతున్నాయో వివరించడానికి మంత్రి కొన్ని ఉదాహరణలను ప్రస్తావించారు.

రక్షణ ప్రాజెక్ట్ (AMCA): కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక రక్షణ ప్రాజెక్ట్ AMCA కోసం కేవలం 37 రోజుల్లోనే 600 ఎకరాల భూమిని సేకరించి అప్పగించాం.

గూగుల్ డేటా సెంటర్: గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను కేవలం 13 నెలల రికార్డు కాలంలోనే పట్టాలెక్కించి ప్రభుత్వ స్పీడ్‌ను నిరూపించాం.

అమరావతి సెల్ఫ్-ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్.. 2028 నాటికి కోర్ క్యాపిటల్

రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై లోకేశ్ ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేవలం ప్రారంభమేనని, అమరావతి ఒక 'సెల్ఫ్-ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్' అని స్పష్టం చేశారు. ప్రస్తుతం రూ.60,000 కోట్ల నిధుల సమీకరణతో అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చిన మాట ప్రకారం.. 2028 నాటికల్లా అమరావతి కోర్ క్యాపిటల్ భవనాలను సిద్ధం చేస్తామని అన్నారు. ఢిల్లీ రాజకీయాల్లో ఏపీ ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ.. 'ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ కూటమిలో ఏపీ నుంచి ఎక్కువ మంది ఎంపీలు ఉండటం వల్ల దేశ రాజధానిలో ఏపీ గొంతు ఎంతో బలంగా వినిపిస్తోంది' అని లోకేశ్ అన్నారు.

మూడు బలమైన ఆర్థిక ప్రాంతాలుగా ఏపీ విభజన

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ను మూడు ప్రధాన ఆర్థిక హబ్‌లుగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి లోకేశ్ వివరించారు.

  • విశాఖపట్నం (వైజాగ్) ఐటీ హబ్ (IT Hub)

  • అమరావతి నాలెడ్జ్ హబ్ (Knowledge Hub)

  • రాయలసీమ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ (Manufacturing Hub)


టీడీపీలో జనరేషన్ షిఫ్ట్.. యువతకు పెద్దపీట

రాజకీయాల్లో మార్పుల గురించి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో స్పష్టమైన 'జనరేషన్ షిఫ్ట్' (నాయకత్వ మార్పు) కనిపిస్తోందని లోకేశ్ అన్నారు. తాము యువతకు పెద్దపీట వేస్తున్నామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 50 శాతం మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారేనని మంత్రి నారా లోకేశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.


ఇవి కూడా చదవండి..

‘నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో

ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 22 , 2026 | 05:21 PM