Share News

అంటు వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు: మంత్రి సత్యకుమార్ యాదవ్

ABN , Publish Date - Sep 13 , 2026 | 04:20 PM

అంటువ్యాధుల నియంత్రణకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం అమరావతిలో ఆయన మాట్లాడారు.

అంటు వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు: మంత్రి సత్యకుమార్ యాదవ్

అమరావతి, సెప్టెంబర్ 13: అంటువ్యాధుల నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం అమరావతిలో ఆయన మాట్లాడారు. వర్షాలు కురుస్తున్నందున డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేసులు పెరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో మందు పిచికారీ చేయాలని, దోమతెరల పంపిణీని ముమ్మరం చేయాలన్నారు.


ప్రతి శుక్రవారం ‘డ్రై డే’

ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బందితో డ్రై డే అమలు చేయాలన్నారు. కేసులు పెరిగితే అన్ని స్థాయిలకు వెంటనే అలర్టులు వెళ్లే వ్యవస్థ రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇక గత నెల 30 నాటికి రాష్ట్రంలో 7,895 మలేరియా కేసులు నమోదయ్యాయని, నిరుటితో పోలిస్తే మలేరియా కేసులు 27.9 శాతం పెరిగాయని వెల్లడించారు. అల్లూరి, పోలవరం, విజయనగరం ప్రాంతాల్లో మలేరియాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అల్లూరి, పోలవరం, పార్వతీపురం మన్యం, ఏలూరులో రెండో విడత మందు పిచికారీ చేయాలని సూచించారు. ఇక అర్హులకు 5.99 లక్షల దోమతెరల పంపిణీ ప్రారంభించామని చెప్పారు.


రాష్ట్రంలో 1,475 డెంగీ కేసులు నమోదు

రాష్ట్రంలో 1,475 డెంగీ కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. కడపలో 48 నుంచి 128కు, చిత్తూరులో 73 నుంచి 112కు డెంగీ కేసులు పెరిగాయని వివరించారు. కర్నూలు, అనకాపల్లిలో కేసులు తగ్గాయని వెల్లడించారు. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో వెంటనే దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే, రాష్ట్రంలో ఇప్పటివరకు 941 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. అల్లూరి, పార్వతీపురం మన్యంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరిగాయని, శ్రీకాకుళంలో ఆహారం ద్వారా వచ్చే వ్యాధుల కేసులు 34 నుంచి 408కు పెరిగాయని వివరించారు. శ్రీకాకుళంలో తాగునీరు, ఆహార పరిశుభ్రతపై ప్రత్యేక తనిఖీలు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆహారం ద్వారా వచ్చే వ్యాధుల కేసులు 930గా నమోదయ్యాయని పేర్కొన్నారు. కర్నూలులో టైఫాయిడ్ కేసుల నేపథ్యంలో తాగునీటి వనరులను ఎప్పటికపుడు పరిశీలించాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు: కొండా సురేఖ

విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టు..

For More AP News And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 04:31 PM