Share News

2029 నుంచే మహిళా బిల్లు అమలుకు చర్యలు: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:42 PM

మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను 2029 ఎన్నికల నుంచే అమలు చేసేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. 25 ఏళ్లుగా ఈ బిల్లును అడ్డుకున్న విపక్షాలు మరోసారి ఆటంకపరుస్తున్నాయని మండిపడ్డారు.

2029 నుంచే మహిళా బిల్లు అమలుకు చర్యలు: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
Bhupathiraju Srinivasa Varma

విజయవాడ, ఏప్రిల్ 23: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో ‘నారీ శక్తి వందన్ అధినియం’ ఒకటని అన్నారు. మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని ముందుకు తీసుకొచ్చామని చెప్పారు. మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ ఉండాలని అంటూనే.. 2014కి ముందు ఉన్న ప్రభుత్వాలు దీనిని అమలు చేయకుండా సాకులు చెప్పాయని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలతో చర్చించి, అత్యధిక మెజారిటీతో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిందన్నారు.


మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను 2029 ఎన్నికల నుంచే అమలు చేసేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. 25 ఏళ్లుగా ఈ బిల్లును అడ్డుకున్న విపక్షాలు మరోసారి ఆటంకపరుస్తున్నాయని మండిపడ్డారు. మహిళలు పార్లమెంట్‌కు విచ్చేసి గ్యాలరీలో కూర్చుని ఎదురు చూశారని తెలిపారు. 84 ఓట్ల తేడాతో బిల్లును కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి ఓడించాయని ఆరోపించారు. పెద్ద ఎత్తున మహిళా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో బిల్లును ప్రవేశపెట్టామని.. బిల్లును వ్యతిరేకించిన పార్టీల వైఖరిని ఎండగట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 25 ఏళ్లుగా 33 శాతం పదవులను మహిళలకు కేటాయించిన పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు.


దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కొన్ని పార్టీలు ప్రచారం చేసి బిల్లును తాత్కాలికంగా ఓడించాయని కేంద్ర మంత్రి విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లును ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. లోక్‌సభ స్థానాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల వాటా పెరుగుతుందని తెలిపారు. పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇదే విషయాన్ని వెల్లడించినప్పటికీ ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. మహిళల్లో రాజకీయ చైతన్యం రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ నిర్ణయాల్లో మహిళలు భాగస్వామ్యం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని పార్టీలలో కుటుంబ సభ్యులకే ప్రాధాన్యం ఇస్తూ.. సాధారణ మహిళలకు అవకాశాలు ఇవ్వడంలేదని ఆరోపించారు. 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు జరిగేలా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అందరం కలిసి నడుద్దామని భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

పరిశ్రమలు వస్తున్నాయ్.. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు: సీఎం చంద్రబాబు

విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 23 , 2026 | 05:01 PM