Share News

తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

ABN , Publish Date - Jun 02 , 2026 | 10:34 AM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
Telangana Formation Day

అమరావతి, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలు ఏర్పడినా.. తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే అని సీఎం అన్నారు. మూడున్నర కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలతో యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోవాలి: చంద్రబాబు

‘తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలు ఏర్పడినా... తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోటీ పడి దూసుకుపోవాలి. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలి. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలి. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు దక్కాలి. అత్యుత్తమ జీవన ప్రమాణాలు పొందాలి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో మన రెండు రాష్ట్రాలు కలిసి పని చేసి, కీలక భూమి పోషించి తెలుగు వైభవాన్ని, ప్రాభవాన్ని చాటాలి’ అంటూ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.


తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు: పవన్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మూడున్నర కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలతో యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జనసేన ఊపిరులూదుకున్నది తెలంగాణ గడ్డపైనే. ఈ నేల నుంచే వారసత్వంగా పోరాట పటిమను పుణికి పుచ్చుకున్నది. అణగారినవర్గాల సంక్షేమం, యువత ఆకాంక్షలు, వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగితే గళం వినిపించే తెగువ తెలంగాణలో ఉంది. అటువంటి లక్షణం జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉంది. ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద విలసిల్లే తెలంగాణ రాష్ట్రం సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికీ అంజలి ఘటిస్తున్నాను’ అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఏలూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

మే నెలలో రికార్డు స్థాయి దర్శనాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 02 , 2026 | 10:57 AM