ఏపీలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరుగుతున్నాయి: మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ
ABN , Publish Date - Mar 04 , 2026 | 05:15 PM
ఏపీలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు అధికమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జాబితాలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని తెలిపారు.
విజయవాడ, మార్చి 04: ఆంధ్రప్రదేశ్లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు అధికమవుతున్నాయని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జాబితాలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని తెలిపారు. బుధవారం విజయవాడలో రాయపాటి శైలజ విలేకర్లతో మాట్లాడుతూ.. విశాఖపట్నం మినహా అన్ని జిల్లాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు అధికంగా ఉన్నాయన్నారు. ఈ అంశంపై అన్ని విభాగాలతో కలిసి రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు.
ఒక్కొక్క జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇవి పల్నాడు, కర్నూలు జిల్లాల్లో జరుగుతున్నాయని వివరించారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆరోగ్యం మీద పిల్లలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విలేజ్ డెవలప్మెంట్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
తల్లిదండ్రులు చదువుకోకపోవడం వల్ల కూడా టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరిగే అవకాశం ఉందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దీనిపై తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పిస్తున్నామన్నారు. సోషల్ మీడియా ద్వారా సైతం టీనేజర్లు ఆకర్షణకు గురవుతున్నారని తెలిపారు. టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరిగిపోవడానికి ఇదీ ఓ కారణమని రాయపాటి శైలజ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వేట్లపాలెంలో పేలుడు ఘటనలో 25కి చేరిన మృతులు
Read Latest AP News And Telugu News