రాధాగాయత్రి తల్లిదండ్రులకు పూర్తి సహకారం అందిస్తాం: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Jun 29 , 2026 | 02:15 PM
ముస్సోరీలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన టెకీ రాధాగాయత్రి తల్లిదండ్రులు.. హోం మంత్రి అనితను కలిశారు. కూతురి మరణం, అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై అనుమానాలను హోం మంత్రికి వివరించారు.
విశాఖపట్నం, జూన్ 29: ముస్సోరీలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన టెకీ రాధాగాయత్రి తల్లిదండ్రులు ఈరోజు(సోమవారం) హోం మంత్రి అనితను కలిశారు. కూతురి మరణం, అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై అనుమానాలను హోం మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలని రాధాగాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి కోరారు. ఇప్పటికే అక్కడి పోలీసులతో ఇన్ఛార్జి జాయింట్ సీపీ మాట్లాడి కేసుపై వివరాలను తీసుకున్నారని ఈ సందర్భంగా హోం మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని రాధాగాయత్రి తల్లిదండ్రులకు అనిత భరోసా ఇచ్చారు.
నిందితుడికి శిక్ష పడాలి: హోం మంత్రి
రాధాగాయత్రీ కుటుంబ సభ్యులు తనను కలిశారని.. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని హోం మంత్రి అన్నారు. రాధాగాయత్రి మరణంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. ఉత్తరాఖండ్ డీజీపీతో మాట్లాడమని ఏపీ డీజీపీకి చెప్పారన్నారు. రాధాగాయత్రి మృతిపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆమె మరణం వెనుకున్న రహస్యం బయటపడాలని.. నిందితుడికి కఠిన శిక్ష పడాలని అన్నారు. రాధాగాయత్రి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.
మాకు ధైర్యం కలిగింది: రాధాగాయత్రి పేరెంట్స్
హోం మంత్రిని కలిసిన అనంతరం రాధాగాయత్రి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. ‘మా బాధను హోం మంత్రి అనితతో చెప్పుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హోం మంత్రి భరోసా ఇచ్చారు. హోం మంత్రి భరోసాతో మాకు ధైర్యం కలిగింది. రాధాగాయత్రి మృతి విషయంలో మాకు న్యాయం చేయాలి. శ్రీచరణ్ ఒకచోట ఉండకుండా పరిగెడుతున్నాడు’ అంటూ గాయత్రి తల్లిదండ్రులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
జగన్ కన్ఫ్యూజ్ అయ్యి.. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు: మంత్రి గొట్టిపాటి రవికుమార్
వర్షం ఎఫెక్ట్.. మధిర రైతు ఆశీర్వాద సభ రద్దు.. హైదరాబాద్కు షిఫ్ట్
Read Latest AP News And Telugu News