తీరు మార్చుకోకపోతే అవమానాలు తప్పదు.. వైసీపీ నేతలకు మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:47 PM
రెండు రోజుల క్రితం అమరావతిలో జరిగిన అల్లర్లపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే అమరావతిలో వైసీపీ అల్లర్లు అంటూ ఆరోపించారు.
కృష్ణాజిల్లా, జూన్ 29: రెండు రోజుల క్రితం అమరావతిలో జరిగిన అల్లర్లపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ డైరెక్షన్లోనే అమరావతిలో వైసీపీ అల్లర్లు అంటూ వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా ఉన్న అమరావతి రైతుల్లో అలజడులు సృష్టించేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా విజ్ఞత వదిలేశారన్నారు. అమరావతి పరిరక్షణ కమిటీ పేరుతో అమరావతిలో అశాంతి నెలకొల్పాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు.
అమరావతిని వ్యతిరేకించిన వైసీపీ నేతలకు ఆ ప్రాంతంలో పర్యటించే హక్కు లేదని మంత్రి అన్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు పబ్లిక్గా బూతులు మాట్లాడి అక్కడి రైతుల్ని రెచ్చగొట్టారని తెలిపారు. నాడు మూడు రాజధానుల పేరుతో అమరావతి రైతుల్ని ఇబ్బందులు పెట్టారని.. దాడులు చేసి తీవ్రంగా కొట్టారని గుర్తుచేశారు. అధికారం పోయిన తర్వాత 'మావిగన్' అంటూ మరోసారి అమరావతిపై తమకున్న అక్కసును తీర్చుకుంటున్నారని విరుచుకుపడ్డారు. మళ్లీ ఇప్పుడు అమరావతి పరిరక్షణ కమిటీ పేరుతో కొత్త డ్రామాకు తెర లేపారన్నారు. వైసీపీ నేతలు తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మరిన్ని అవమానాలు పడాల్సి వస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
ఎల్నినో ప్రభావం.. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి: మంత్రి అచ్చెన్నాయుడు
జగన్ కన్ఫ్యూజ్ అయ్యి.. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు: మంత్రి గొట్టిపాటి రవికుమార్
Read Latest AP News And Telugu News