Share News

పుష్కర లిఫ్ట్ స్కీం పైప్‌లైన్ పనులపై సమీక్ష.. ఏజెన్సీ ప్రతినిధులపై మంత్రి నిమ్మల ఆగ్రహం

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:59 AM

పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనులు వేగవంతంగా జరగకపోవడంపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులపై నిమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుష్కర లిఫ్ట్ స్కీం పైప్‌లైన్ పనులపై సమీక్ష.. ఏజెన్సీ ప్రతినిధులపై మంత్రి నిమ్మల ఆగ్రహం
Minister Nimmala Ramanaidu

విజ‌య‌వాడ‌, ఆగస్టు 12: పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు(బుధవారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవలే పుష్కర ఎత్తిపోతల పైప్‌లైన్ పనులకు సంబంధించి వర్క్ షెడ్యూల్‌ను సీఎం చంద్రబాబుకు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు అందజేశారు. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారం పనుల జరుగుతున్నాయో లేదో పరిశీలించి, మంత్రి నిమ్మలకు ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు రిపోర్ట్ అందించారు. అయితే, పనులు వేగంగా జరగకపోవడంపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులపై నిమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే.. కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించడానికి కూడా వెనుకాడవద్దని కలెక్టర్, ఎస్పీలను మంత్రి ఆదేశించారు. పనుల్లో అలసత్వంపై ఈఈకి మెమో ఇవ్వాలని ఈఎన్సీకి ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్కా, ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. పుష్కర లిఫ్ట్ స్కీం పైప్‌లైన్ పనులకు సంబంధించి, ప్రతి రోజూ వర్క్ ప్రోగ్రెస్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈనెలాఖరున సీఎం చంద్రబాబు.. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు వెళ్లేలా గోదావరి జలాలను విడుదల చేస్తారని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పోలవరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహ మూర్తి, ఈఈలు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

దోమల నివారణకు పురుగుమందు పిచికారీ.. కాసేపటికే ఇద్దరి మృతి

విశాఖలో నీటి కొరతపై ముందస్తు చర్యలు: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 12:09 PM