తిరుపతి వెటర్నరీ వర్సిటీలో చిరుత సంచారంపై డిప్యూటీ సీఎం ఆరా
ABN , Publish Date - May 25 , 2026 | 12:13 PM
తిరుపతి వెటర్నరీ యూనివర్శిటీలో చిరుత సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. చిరుతను సురక్షితంగా పట్టుకునేందుకు తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, మే 25: తిరుపతి శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో చిరుత సంచారంపై ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ప్రస్తుతం చిరుత ఎక్కడ ఉంది? పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశాలపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో రాజమండ్రి నుంచి పవన్ ఫోన్లో సమీక్షించారు. చిరుత ప్రస్తుతం గదిలో నక్కి ఉందని.. సిబ్బంది ఇప్పటికే ఆ ప్రదేశానికి చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా అప్రమత్తంగా వ్యవహరించాలని, చిరుతకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకుని తిరిగి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
జూ సిబ్బంది సహకారం తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. రెస్క్యూ సందర్భంగా విద్యార్థులు, విశ్వవిద్యాలయం సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. చిరుత సంచారంపై ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎంవో సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్లో రోగికి.. చైనా నుంచి సర్జరీ
ఆయిల్ కంపెనీల తీరుపై పెట్రోల్ బంక్ యజమానుల ఆగ్రహం
Read Latest AP News And Telugu News