ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ: డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:59 PM
దేశం పట్ల ప్రేమ, దేశ ప్రజల పట్ల అంకితభావం అనే సిద్ధాంతాలే ఆలంబనగా బీజేపీ ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 6: బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ఎక్స్లో శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ 47వ వసంతంలో అడుగిడుతున్న శుభ తరుణాన ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం పట్ల ప్రేమ, దేశ ప్రజల పట్ల అంకితభావం అనే సిద్ధాంతాలే ఆలంబనగా బీజేపీ ముందుకు వెళ్తోందన్నారు.
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ లాంటి మహనీయుల సంకల్పం.. ప్రధాని మోదీ అచంచల విశ్వాసంతో కూడిన పోరాటంతో నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ కీర్తిని ఆర్జించిందని వెల్లడించారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో కూడా సమర్ధవంతమైన విధానాలు అమలు చేస్తూ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిందన్నారు. భారతీయ జనతా పార్టీ వికసిత్ సంకల్పం దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం: పీవీఎన్ మాధవ్
బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
Read Latest AP News And Telugu News