ఎంతటివారితోనైనా అనైతిక పనులు చేయించగల మూర్ఖుడు జగన్: మంత్రి పార్థసారథి
ABN , Publish Date - Aug 28 , 2026 | 09:31 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి మరోసారి విరుచుకుపడ్డారు. తన అధికార దాహంతో ఎవరినైనా బలి చేయడానికి వెనుకాడని వ్యక్తి జగన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.
అమరావతి, ఆగస్టు 28: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి మరోసారి విరుచుకుపడ్డారు. తన అధికార దాహంతో ఎవరినైనా బలి చేయడానికి వెనుకాడని వ్యక్తి జగన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. అధికారులు, పారిశ్రామికవేత్తలను జైలుపాలు చేసిన చరిత్ర జగన్దన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అధికారుల జీవితాలతో వైసీపీ అధినేత ఆడుకున్నారని ఆరోపించారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో జగన్ అక్రమ వ్యవహారాలతో మహిళా ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి జైలు జీవితం తప్పలేదన్నారు.
ఎంతటివారితోనైనా అనైతిక పనులు చేయించగల మూర్ఖుడు మాజీ సీఎం అంటూ మంత్రి విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనం కోసం అమాయకులను ఇబ్బంది పెట్టిన తీరుకు నటి జత్వానీ ఉదంతమే సాక్ష్యమన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఊహించని రీతిలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారని తెలిపారు. సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులు హయాంలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనతో వ్యవస్థలను దిగజార్చారని మండిపడ్డారు. జగన్ రెడ్డి కనుసన్నల్లోనే సీనియర్ అధికారులను పావుగా వాడుకుని ఏపీపీఎస్సీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. తన రాజకీయ స్వార్థం కోసం విశాల్ గున్ని, కాంతి రాణా లాంటి పోలీసు అధికారులను వాడుకుని వారిని బలిపశువులను చేశారన్నారు.
వైసీపీ అధినేత కనుసన్నల్లో పనిచేసిన పలువురు అధికారులు తమ కెరీర్ను చిక్కుల్లో పడేసుకున్నారని మంత్రి అన్నారు. ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ను కూడా చిక్కుల్లో పడేశారని తెలిపారు. తన స్వార్థం కోసం దేశంలోనే పేరున్న పారిశ్రామికవేత్తనూ వివాదాల్లోకి లాగారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ దోపిడీ రాజకీయాలలో ఇరుక్కుపోయి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. మాజీ సీఎం మాట విని తప్పుడు పనులు చేసిన అధికారులు, నాయకులు, పారిశ్రామిక వేత్తలు.. చివరకు తీవ్ర విమర్శలు, అవమానాల పాలయ్యారన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి, వ్యక్తుల జీవితాలను నాశనం చేసిన జగన్ తీరును ప్రతి ఒక్కరూ గమనించాలని తెలిపారు. ప్రజలారా ఆలోచించండి.. రాష్ట్ర శ్రేయస్సు, యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ అరాచకాలను నిష్పక్షపాతంగా పరిశీలించాల్సిన సమయం ఇది అంటూ మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
జర్నలిస్టు అవార్డుల పేర్లు మార్పు
Read Latest AP News And Telugu News