మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 17 , 2026 | 03:07 PM
ఏపీలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అమరావతి, మార్చి 17: రాష్ట్రంలో గ్యాస్ సరఫరా విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ నుంచి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. మరికొన్ని మెట్రిక్ టన్నులు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు.
ఆసుపత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలు ప్యానిక్ అవకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ స్టాక్లను పెంచేలా చూడాలని ఆదేశించారు. గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంచి, మెరుగైన పంపిణీ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మరింత విస్తరించే అంశంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీలోని కేజీ(కృష్ణా గోదావరి) బేసిన్లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసేలా చూడాలని పేర్కొన్నారు. సీఎన్జీ, పీఎన్జీల వినియోగాన్ని గరిష్ఠంగా పెంచే అవకాశాలను పరిశీలించాలని మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ సమావేశానికి సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు హాజరయ్యారు.
వంద శాతం గ్యాస్ అందిస్తున్నాం: మంత్రి నాదెండ్ల
ఏపీలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) స్పష్టం చేశారు. 100 శాతం ప్రజలకు గ్యాస్ అందిస్తున్నామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఉండేవారని.. ఇప్పుడు వారు ఆరోగ్యశాఖ కిందకు మారినట్లు చెప్పారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరత ఉందని... వాటిని త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టామన్నారు. ఎక్కడ అక్రమ రవాణా జరుగుతున్నా ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. 50 శాతం రాయితీ
మిషన్ మోడ్లో మున్సిపాలిటీల అభివృద్ధి: మంత్రి నారాయణ
Read Latest AP News And Telugu News