Mandipalli Ramprasad: ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డుపై మంత్రి మండిపల్లి రియాక్షన్
ABN , Publish Date - Jan 17 , 2026 | 09:43 AM
ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ - 6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డు రావడం గర్వకారణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. ఈ విజయం ఆర్టీసీ అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది అందరూ ప్రజలకు అంకితభావంతో అందిస్తున్న సేవలకు నిదర్శనమని అభివర్ణించారు.
అమరావతి, జనవరి 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)కు మరో జాతీయ అవార్డు దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా బస్టాప్లలో ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ (AAS) విజయవంతంగా అమలు చేసినందుకు గానూ ఏపీఎస్ఆర్టీకి ప్రతిష్టాత్మకమైన గవర్నెన్స్ నౌ – 6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డ్ వరించింది. ఈ అవార్డు ద్వారా ప్రయాణికుల సౌకర్యార్థం డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించిన ఏపీఎస్ఆర్టీసీ కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
ఈ అవార్డుపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) స్పందిస్తూ.. ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ - 6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డు రావడం గర్వకారణమని అన్నారు. ఈ విజయం ఆర్టీసీ అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది అందరూ ప్రజలకు అంకితభావంతో అందిస్తున్న సేవలకు నిదర్శనమని అభివర్ణించారు. ప్రధాన బస్టాప్లలో అమలు చేసిన ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులకు రియల్- టైమ్, స్పష్టమైన సమాచారం అందుతోందని తెలిపారు. ముందస్తు సమాచారం అందించడం వల్ల సేవల నాణ్యత గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు.
ఈ అవార్డు సాధనలో కీలక పాత్ర పోషించిన ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో పాటు సిబ్బందిని మంత్రి అభినందించారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్కు అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుని ఆర్టీసీ ముందడుగులు వేస్తోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రయాణికులకు మరింత ఆధునిక, సౌకర్యవంతమైన సేవలు అందిస్తామన్నారు. ప్రజా రవాణా రంగంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పండుగల సమయంలో సాధారణ ఛార్జీలు కొనసాగిస్తూ ఏపీఎస్ఆర్టీసీని దేశానికి ఆదర్శంగా నిలబెడతామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
కుక్కను దైవంలా పూజిస్తున్న భక్తులు.. పునర్జన్మ ఎత్తిందంటూ..
Read Latest AP News And Telugu News