రిజిస్ట్రేషన్ సేవలను సులభంగా పొందేందుకే RSKల ఏర్పాటు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 20 , 2026 | 04:43 PM
ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేయబోతున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల అంశం ప్రస్తావనకు వచ్చింది.
అమరావతి, జులై 20: ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేయబోతున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల అంశం ప్రస్తావనకు వచ్చింది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంటే... కొందరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసేలా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం-RSKలను ఏర్పాటు చేస్తున్నామని... ఇది ప్రైవేటీకరణ ఎంత మాత్రమూ కాదని చెప్పారు.
పాస్ పోర్టు సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పని చేస్తాయని సీఎం వెల్లడించారు. పాస్ పోర్టు సేవా కేంద్రాల ఏర్పాటుతో పాస్ పోర్టు ప్రాసెసింగ్ సులభతరమైందన్నారు. ఇదే తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను సులభంగా పొందవచ్చని అన్నారు. ఆర్ఎస్కే ద్వారా సేవలు సులభతరంగా పొందడంతో పాటు.. మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుందని చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవలందించేలా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంటే... కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యతను అధికారులు తీసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల కలిగే లాభాలను వివరించాలన్నారు. డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారి ఉపాధికి ఇబ్బంది లేని విధంగా ఆదాయ మార్గాలు చూపెడతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
‘హెల్తీ- వెల్తీ- హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ లక్ష్యంగా ముందుకు: మంత్రి అనగాని సత్యప్రసాద్
ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి.. కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
Read Latest AP News And Telugu News