గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
ABN , Publish Date - Feb 11 , 2026 | 03:08 PM
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల జవాబుపత్రాలు భద్రంగా ఉన్నాయా? లేదా? వాటిని ఎవరైనా ట్యాంపర్ చేశారా? అనేది ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలించాలని సూచించింది.
అమరావతి, ఫిబ్రవరి 11: ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై రాష్ట్ర హైకోర్టు(AP HighCourt) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మూల్యాంకనంలో చోటు చేసుకున్న అక్రమాలను నిగ్గు తేల్చేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటుకు ధర్మాసనం ఆదేశించింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రం వెలుపల ఉన్న ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకోవాలని స్పష్టీకరించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా? లేదా? వాటిని ఎవరైనా ట్యాంపర్ చేశారా? అనేది ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలించాలని న్యాయస్థానం సూచించింది.
విజయవాడలో జరిగిన మూల్యాంకనం సమయంలో ఉపయోగించిన బార్కోడ్లు, అసలు ఓఎంఆర్ షీట్లలోని వివరాలు ఒకదానికొకటి సరిపోలుతున్నాయా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు.. దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశమున్నందున వారందరినీ అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 16లోగా నివేదిక సమర్పించాలని సిట్ను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి అనుబంధ పిటిషన్లను పరిష్కరించిన హైకోర్టు.. ప్రధాన వ్యాజ్యాలపై విచారణను వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి...
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రభుత్వ పాలన: గవర్నర్ అబ్దుల్ నజీర్
జగన్ అవకాశం ఇవ్వకపోతే... సొంతంగా పోటీచేసి నా బలం చూపిస్తా: దువ్వాడ శ్రీనివాస్
Read Latest AP News And Telugu News