ఏపీ ఉద్యోగులకు డబుల్ ధమాకా.. రిటైర్మెంట్ వయసు పెంపు, 11 వేల మందికి OPS
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:30 PM
ఆంధ్రప్రదేశ్లో 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతి, జూన్ 23: ఆంధ్రప్రదేశ్లో 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. ఈరోజు(మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల విద్యాసంస్థలు, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్ల పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, మెమో-57 ప్రకారం 2004 సంవత్సరానికి ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన సుమారు 11 వేల మంది ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(CPS) నుంచి పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సీపీఎస్ అసోసియేషన్ హర్షం
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ సచివాలయ CPS అసోసియేషన్ స్వాగతించింది. OM నెం.57 అమలుపై సీపీఎస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. కేబినెట్ నిర్ణయంతో రాష్ట్రంలోని 11 వేల మంది CPS ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. వెటరన్, ఫ్యామిలీ CPS కంట్రిబ్యూషన్పై స్పష్టతనిచ్చిన సర్కార్.. 2017 నుంచి పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపించింది. ఉద్యోగుల గ్రాడ్యుటీ మేరకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్కు CPS అసోసియేషన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని CPS అసోసియేషన్ పేర్కొంది.
ఉద్యోగుల కల నెరవేరింది: విద్యాసాగర్
ఏపీ కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు. సీపీఎస్ నుంచి ఓపీఎస్లోకి మెమో 57 ప్రకారం 11 వేలమంది ఉద్యోగులకు మేలు జరిగిందన్నారు. ప్రభుత్వరంగ ఉద్యోగుల పదవి విరమణ వయసును 60 నుంచి 62కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేబినెట్ నిర్ణయంతో ఈరోజు ఉద్యోగుల కల నెరవేరిందన్నారు. అందుకే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్కు ఉద్యోగులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని తెలిపారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీ అంశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించాలని విద్యాసాగర్ కోరారు.
ఇవి కూడా చదవండి..
అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరి అరెస్ట్
పరవాడ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంపై పవన్ కల్యాణ్ ఆరా
Read Latest AP News And Telugu News