జ్యోతిరావు పూలేకు సీఎం చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళులు
ABN , Publish Date - Apr 11 , 2026 | 09:45 AM
ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఘనంగా నివాళులర్పించారు. సామాజిక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని వారు కొనియాడారు.
అమరావతి, ఏప్రిల్ 11: మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేశ్(Minister Nara lokesh) ఘన నివాళులర్పించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన మహానుభావుడు అని సీఎం చంద్రబాబు అన్నారు. సామాజిక సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని మంత్రి లోకేశ్ కొనియాడారు. ఆ మహాత్ముని జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం, మంత్రి పోస్టు చేశారు.
సామాజిక విప్లవ పితామహుడు పూలే: సీఎం చంద్రబాబు
‘మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశాబ్ది జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. సామాజిక విప్లవ పితామహుడు పూలే. కుల వివక్షకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించిన మహానుభావుడు మనకు ఎప్పటికీ ఆదర్శం. ఆయన చూపిన మార్గంలో నడవడం మన సామాజిక బాధ్యత. ‘విద్య లేనివాడు వివేకం కోల్పోతాడు, వివేకం లేనివాడు నైతికత కోల్పోతాడు, నైతికత లేనివాడు అభివృద్ధిని కోల్పోతాడు’ అని ఆయన చేసిన బోధనలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి’ అని సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్టు చేశారు.
లోకేశ్ ట్వీట్
‘ప్రముఖ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. దళితుల అభ్యున్నతి, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు ఆయన జీవితాంతం కృషిచేశారు. విద్య ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేశారు. ఆయన జయంతిని ప్రజాప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. సామాజిక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకు అందరం కృషి చేద్దాం’ అంటూ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
పూలే లక్ష్య సాధనే ప్రభుత్వ ధ్యేయం: సవిత
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని మంత్రి సవిత అన్నారు. మహిళా విద్య, దళిత, బడుగు వర్గాల హక్కులకు, కుల వ్యవస్థ నిర్మూలనకు పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని తెలిపారు. జ్యోతిరావు పూలే లక్ష్య సాధనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. నేడు రాష్ట్రంలో రాష్ట్ర పండుగగా, అధికారికంగా జ్యోతారావు పూలే జయంతిని నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి సవిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఇరాన్కు ట్రంప్ వార్నింగ్.. చర్చలు విఫలమైతే మరిన్ని దాడులు
ఏపీలో చిన్నారులకు డ్రై రేషన్ కార్యక్రమం చేపట్టిన కూటమి ప్రభుత్వం
Read Latest AP News And Telugu News