ఖాజీపేట ఘటన.. ప్రేమోన్మాది వెంకటేష్పై పోలీసుల కాల్పులు
ABN , Publish Date - Apr 11 , 2026 | 07:07 AM
ప్రేమోన్మాది వెంకటేష్పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడిని మైదుకూరు నుంచి తీసుకెళుతుండగా.. బాసాపురం చెక్పోస్ట్ దగ్గర పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అడ్డుకోవటంతో వారిపై దాడి చేశాడు. ఈ నేపథ్యంలోనే సీఐ వంశీధర్ నిందితుడిపై కాల్పులు జరిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఖాజీపేట విద్యార్థిని రామకీర్తనను చంపిన ప్రేమోన్మాది వెంకటేష్పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడిని మైదుకూరు నుంచి తీసుకెళుతుండగా.. బాసాపురం చెక్పోస్ట్ దగ్గర పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అడ్డుకోవటంతో వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే సీఐ వంశీధర్ నిందితుడిపై కాల్పులు జరిపారు. దీంతో నిందితుడి కాలికి గాయం అయింది. పోలీసులు అతడిని కడప రిమ్స్కు తరలించారు.
కేసు వివరాలు..
కడప జిల్లాలోని ఖాజీపేట మండలం ఆంజనేయకోట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్ అనే యువకుడు, అదే మండలం ఖాజీపేట అగ్రహారానికి చెందిన రామకీర్తనను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. ఇందుకు బాలిక నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి వెళ్లాడు. పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి తెచ్చాడు. బాలిక ఇందుకు ఒప్పుకోకపోవటంతో ఆగ్రహానికి గురయ్యాడు.
వెంటతెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడికి దిగాడు. బాలిక గొంతు కోసి అక్కడినుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి శ్రీనివాసులు హుటాహుటిన ఇంటికి వెళ్లాడు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన ఆమెను చేతులతో మోసుకొని వాహనంలోకి చేర్చాడు. కూతురిని కడప రిమ్స్కు తరలించే ప్రయత్నం చేశాడు. కొనఊపిరితో ఉన్న బాలిక వెంకటేశ్తో పాటు ప్రవీణ్ అనే వ్యక్తి పేరును తండ్రికి చెప్పింది. మార్గం మధ్యలో చెన్నూరు వద్ద ప్రాణాలు కోల్పోయింది.
ఇవి కూడా చదవండి