పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్యే ప్రశ్న.. మంత్రి సమాధానం
ABN , Publish Date - Feb 25 , 2026 | 09:46 AM
ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్యే గల్లా మాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సమాధానం ఇచ్చారు.
అమరావతి, ఫిబ్రవరి 25: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) పదోరోజుకు చేరుకున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అసెంబ్లీలో ప్రశ్న లేవనెత్తారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులు సరైన వేతనాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది పొరుగు సేవల ఉద్యోగులు ఉన్నారని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సరిగా అందడం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు పొందడమే దీనికి కారణమని తెలిపారు. అంతేకాకుండా, వైద్య సౌకర్యాలు కూడా సరిగా అందడం లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు.
ఈ ప్రశ్నకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు. రూ.10 వేల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారు సంక్షేమ పథకాలు పొందలేరని స్పష్టం చేశారు. వారి పిల్లలకు సంక్షేమ పథకాలు అందడం లేదనే విషయం నిజమేనని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఉపకార వేతనాలు అందిస్తున్నామని చెప్పారు. అందరికీ సంక్షేమ పథకాలు అందించే అంశాన్ని ప్రభుత్వ పరిశీలనకు పంపుతామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సభలో తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
Read Latest AP News And Telugu News