కేరళ ఇక కేరళం!
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:48 AM
కేరళ ఇకపై కేరళం కానుంది. ఈ రాష్ట్రం పేరును మార్చడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ ప్రతిపాదనకు మంగళవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
రాష్ట్ర పేరు మార్పునకు కేంద్రం ఆమోదం
సేవా తీర్థ్లో తొలిసారి క్యాబినెట్ భేటీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: కేరళ ఇకపై కేరళం కానుంది. ఈ రాష్ట్రం పేరును మార్చడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ ప్రతిపాదనకు మంగళవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఒక రాష్ట్రం పేరు మార్చాలంటే ఆ ప్రతిపాదన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించాలి. రాష్ట్ర పేరు మార్పు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకుంటారు. తర్వాత బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. ఆ బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ సరిపోతుంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో పేరు అధికారికంగా మారుతుంది. ఈ ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. కేరళ పేరు మార్పుపై తొలిసారి 2023లో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఇదిలా ఉండగా, మంగళవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం కొత్తగా నిర్మించిన ప్రధానమంత్రి కార్యాలయం ‘సేవా తీర్థ్’లో జరిగింది. సేవాతీర్థ్లో క్యాబినెట్ భేటీ జరగడం ఇదే తొలిసారి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించిన రూ.9072 కోట్ల విలువైన మూడు రైల్వే ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జనపనార మద్దతు ధరను క్వింటాలుకు రూ.275 పెంచారు.