బొగ్గు ఉత్పత్తిలో గెవ్రా గని రికార్డు
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:14 AM
ఛత్తీస్గఢ్లోని కోర్బాలో ఉన్న గెవ్రా బొగ్గు గని ఉత్పత్తిలో దూసుకుపోతోంది. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గనిగా గెవ్రా రికార్డులకు ఎక్కింది.
ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచిన గని.. విస్తరణలోనూ తొలి గనిగా మారనున్న ‘గెవ్రా’
2027-28లో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
ఎస్ఈసీఎల్ సీఎండీ హరీశ్ దుహాన్
(ఛత్తీస్గఢ్ కోర్బా నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి)
ఛత్తీస్గఢ్లోని కోర్బాలో ఉన్న గెవ్రా బొగ్గు గని ఉత్పత్తిలో దూసుకుపోతోంది. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గనిగా గెవ్రా రికార్డులకు ఎక్కింది. కోల్ ఇండియా అనుబంధ కంపెనీ సౌత్ ఈస్ట్రర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్(ఎ్సఈసీఎల్)కు చెందిన ఈ గని ఉత్పత్తి చేసే బొగ్గును ఏడు రాష్ట్రాలకు అందిస్తుండగా.. దేశంలో 6 శాతం విద్యుత్ అవసరాలను తీరుస్తోంది. దేశంలో వెలిగే ప్రతి 100 బల్బుల్లో ఆరు బల్బుల వెలుగు వెనక గెవ్రా పాత్ర ఉంది. 1981లో ఈ గనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా 5మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన ఈ గని.. క్రమక్రమంగా ఉత్పత్తిలో రికార్డులను నెలకొల్పుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 56 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే స్థాయికి చేరింది. 2024-25లో 54 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా.. 2025-26లో 56 మిలియన్ టన్నులు, 2026-27 లో 63 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2027-28లో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోనున్నామని ఎస్ఈసీఎల్ సీఎండీ హరీశ్ దుహాన్ వెల్లడించారు. రానున్న రోజుల్లో విస్తరణలోనూ ఈ గని ప్రపంచంలోనే అతిపెద్ద తొలి ఓపెన్కాస్టుగా నిలవనుందన్నారు. కోల్ ఇండియా 4 రోజుల పాటు ఎస్ఈసీఎల్లో జాతీయ మీడియా టూర్ను నిర్వహించింది. ఇందులో భాగంగా ఛత్తీ్సగఢ్లో ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి పర్యటించి.. సంస్థ సీఎండీ హరీశ్ దుహన్తో ముచ్చటించగా ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా నార్త్ యాంటెలోప్ రోషెల్లో పౌడర్ రివర్ బేసిన్లోని బ్లాక్ థండర్ గని 85మిలియన్ టన్నులతో ప్రపంచంలోనే తొలి అతిపెద్ద గని కాగా.. రఇక గెవ్రా కూడా భవిష్యత్లో 80 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకోనుందని తెలిపారు. ఎస్ఈసీఎల్ ఛత్తీ్సగఢ్తో పాటు మధ్యప్రదేశ్లోనూ ఉత్పత్తి చేస్తున్న బొగ్గు ను ఏడు రాష్ట్రాల విద్యుత్ అవసరాలతో భారీ పరిశ్రమలకు విక్రయిస్తున్నట్లు వివరించారు.
1000 గుండెలకు కోల్ ఇండియా దన్ను
కోల్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎ్సఆర్) కింద 2014 నుంచి ఇప్పటిదాకా రూ. 850 కోట్లకు పైగా సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్(ఎ్సఈసీఎల్) నిధులు వెచ్చించింది. ఇప్పటివరకు ఏకంగా 300 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించింది. ఇక కోలిండియా ఖాతాలో దీని అనుబంధ సంస్థలన్నీ కలిపి 1000 మందికి గుండె శస్త్ర చికిత్సలు చేయించినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఛత్తీ్సగఢ్ రాజధాని న్యూరాయ్పూర్ వద్ద 30 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ సత్యసాయి సంజీవని ఆస్పత్రి ఉంది. దీని నిర్మాణంలో కూడా కోలిండియా సీఎ్సఆర్ నిధులు ఉన్నాయి. సీఎ్సఆర్ నిధులతో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీతో కలిసి 2300 మందికి వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇప్పించామని, వీరిలో 90 శాతం మంది ఉద్యోగ అవకాశాలు దొరికాయని (ఎస్ఈసీఎల్) అధికారులు పేర్కొన్నారు.