జూన్ 9 నుంచి 30 వరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మ్యాచ్: ఎంపీ కేశినేని చిన్ని
ABN , Publish Date - Jun 07 , 2026 | 05:18 PM
విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాల్లో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏ.పి.యల్) మ్యాచ్లు జరుగుతాయని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. జూన్ 30వ తేదీన మంగళగిరి వేదికగా జరిగే ఏ.పి.యల్ ఫైనల్ మ్యాచ్కు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హజరవుతారని తెలిపారు.
విజయవాడ, జూన్07: జూన్ 9వ తేదీ నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏ.పి.యల్) మ్యాచ్ ప్రారంభమవుతుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. ఇవి జూన్ 30వ తేదీతో ముగుస్తాయని తెలిపారు. మొత్తం ఏడు టీంలు ఈ క్రికెట్ పండుగకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆదివారం విజయవాడలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఈ సారి విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాల్లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఈ మ్యాచ్లు జరుగుతాయని వివరించారు. జూన్ 30వ తేదీన మంగళగిరి వేదికగా జరిగే ఏ.పి.యల్ ఫైనల్ మ్యాచ్కు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హజరవుతారని పేర్కొన్నారు.
జూన్ 9 నుంచి 13వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా ఏ.పి.యల్ మ్యాచ్ జరుగుతాయన్నారు. కడపలోని జూన్ 17 నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. జూన్ 24 నుంచి 30వ తేదీ వరకు మంగళగిరిలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని చెప్పారు. ఈ మ్యాచ్లు తిలకించేందుకు పాఠశాల, కళాశాల విద్యార్థులను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సారి విద్యాసంస్థలకు షెడ్యూల్ సమాచారం ముందే అందిస్తామని తెలిపారు. విశాఖపట్నంలో పది ప్రాంతాల్లో ఫ్లాష్ మాబ్ల ద్వారా ఈ మ్యాచ్ల గురించి ప్రజలకు తెలియచేస్తామని ఆయన వివరించారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పాస్లు ఇస్తామని పేర్కొన్నారు. జియో స్టార్ స్పోర్ట్స్ చానెల్లో ఈ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తారని వివరించారు. ఇండియా A టీంలో గుంటూరుకు చెందిన రషీద్కు అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఏ.పి.యల్ మ్యాచ్ల ద్వారా కూడా ప్రతిభ ఉన్న క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఎంపీ కేశినేని చిన్ని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏ.పి.యల్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రీడాకారులు మాత్రమే పాల్గొంటారని స్పష్టం చేశారు.
ఈ పోటీలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతిరోజూ వార్తలను ప్రజలకు అందించాలని మీడియాకు ఆయన సూచించారు. వర్ధమాన క్రీడాకారులను ప్రాత్సహించాలని కోరుతున్నామన్నారు. ఏ.పి.యల్ ప్రారంభించే సమయానికి తమ వద్ద బడ్జెట్ చాలా స్వల్పంగా ఉందని చెప్పారు. ఖరీదైన బోర్డు కాకపోయినా.. ఇతర మ్యాచ్ల తరహాలో వీటిని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. 20-20 మ్యాచ్ల్లో క్రీడాకారులను ఆక్షన్ (వేలం) ద్వారా తీసుకున్నారని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం విశాఖపట్నంలో బాడీ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని వివరించారు.
ఇతర వివరాలతోపాటు షెడ్యూల్ అన్నీ అక్కడే ప్రకటిస్తారన్నారు. మీడియాకు కూడా మ్యాచ్ల వివరాలు ఎప్పటికప్పుడు అందచేసేలా ఏర్పాట్లు చేస్తామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన అధ్యక్షుడు కేశినేని చిన్ని వివరించారు. గత ఏ.పి.యల్ ఫైనల్ మ్యాచ్ విశాఖ వేదికగా నిర్వహించామని.. దీనిని ఇరవై వేల మంది వీక్షించారని ఎంపీ కేశినేని చిన్ని గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయ్కు రాజ్యసభ సీటు రావడం సంతోషంగా ఉంది: పీలా శ్రీనివాసరావు
బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా రాదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే
Read Latest AP News And Telugu News