కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ.. వాయిదా
ABN , Publish Date - Apr 27 , 2026 | 09:15 PM
విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో తనపై జరిగిన కోడికత్తి దాడి కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు సోమవారం విచారించింది.
అమరావతి, ఏప్రిల్ 27: విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో తనపై జరిగిన కోడికత్తి దాడి కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు సోమవారం విచారించింది. దీనిపై సందేహాలు నివృత్తి చేసుకునేందుకు విచారణను మే 6వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం ఈ కేసును మే 6వ తేదీకి వాయిదా వేసింది. వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. ఎన్ఐఏ విస్తృత కుట్రకోణంలో దర్యాప్తు సాగించలేదని వాదనలు వినిపించారు. కేరళ హైకోర్టు తీర్పు ప్రకారం.. ఈ వ్యాజ్యం డివిజన్ బెంచ్ ముందుకు విచారణకు రావాల్సి ఉందని అడిషనల్ సోలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ.. తన వాదనలు వినిపించారు.
అలాగే ఈ కేసులో నిందితుడు శ్రీను తరఫు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ తన వాదనలు వినిపించారు. కోడికత్తి శ్రీను రిమాండ్ ఖైదీగానే ఆరేళ్లు జైలు శిక్ష అనుభవించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేరం నిరూపణ అయినా ఏడేళ్లకు మించి శ్రీనుకి శిక్ష పడదని ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని ఈ సందర్భంగా ఆదినారాయణరావు వాదించారు.
విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో తనపై కోడికత్తి దాడి కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ ఎన్ఐఏ కోర్టును వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను సదరు కోర్టు తిరస్కరించింది. ఎన్ఐఏ కోర్టు తిరస్కరణను సవాల్ చేస్తూ.. ఏపీ హైకోర్టును వైఎస్ జగన్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో వాదనలను ఏపీ హైకోర్టు విన్నది. అనంతరం మే 6వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రైవేట్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చెల్లింపులు ప్రారంభం
విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
For More AP News And Telugu News