వెలిగొండ నిర్మాణంతో.. నిర్వాసితుల జీవితాల్లో వెలుగు: లంక దినకర్
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:33 PM
వెలిగొండ ప్రాజెక్టుతో ఫ్లోరైడ్, కరువు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంక దినకర్ తెలిపారు. ఆదివారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఏపీకి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అయితే ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టు అలాంటిందని అభివర్ణించారు.
అమరావతి, ఆగస్టు 23: వెలిగొండ ప్రాజెక్టుతో ఫ్లోరైడ్, కరువు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంక దినకర్ తెలిపారు. ఆదివారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఏపీకి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అయితే ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టు అలాంటిందని అభివర్ణించారు. దాదాపు మూడు దశాబ్దాల కలగా ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణంతో.. నిర్వాసితుల జీవితాల్లో వెలుగు వచ్చిందన్నారు. సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వెలిగొండతో నీటి లభ్యత పెరుగుతుందని వెల్లడించారు. పోలవరం - బొల్లాపల్లి - వెలిగొండ అనుసంధానంతో దీర్ఘకాలిక నీటి భద్రత సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వెలిగొండ నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.888.55 కోట్లలో రూ.768 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని గుర్తు చేశారు. రెండు నెలల్లో 6,206 నిర్వాసిత కుటుంబాలకు మూడు విడతల్లో పరిహారం చెల్లింపు చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో 25 లక్షల మందికి తాగునీరు, 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. దొనకొండ, కనిగిరి పారిశ్రామిక ప్రాంతాలకు నీటి లభ్యతతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.
2024లో పనులు పూర్తి కాకుండానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశామంటూ వైఎస్ జగన్ ప్రకటించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగాయని వివరించారు. రెండేళ్లలో వెలిగొండ రెండో దశ పనులు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బొల్లాపల్లి మీదుగా గోదావరి జలాలను వెలిగొండకు అనుసంధానం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు డబుల్ ఇంజిన్ సర్కార్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని లంక దినకర్ వెల్లడించారు.
వార్తలు కూడా చదవండి..
శబరిమలలో తెలుగు స్వాముల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: భానుప్రకాశ్ రెడ్డి
ఆ కారణంతోనే యూఎస్ పర్యటనకు అనుమతి నిరాకరించింది: సీఎం రేవంత్ రెడ్డి
For More AP News And Telugu News