అబద్ధాలు, అసత్యాలు వండివారుస్తున్న వైసీపీ నేతలు: దేవినేని ఉమా
ABN , Publish Date - May 17 , 2026 | 03:54 PM
తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లు వదిలేసి ట్విట్టర్ బాట పట్టారంటూ వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించి అబద్ధాలు, అసత్యాలు వండివారుస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, మే17: తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లు వదిలేసి ట్విట్టర్ బాట పట్టారంటూ వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించి అబద్ధాలు, అసత్యాలు వండివారుస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్, ట్విట్టర్లో పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలంటూ వారికి ఆయన చురకలు అంటించారు.
ఆదివారం రాజధాని అమరావతిలో దేవినేని ఉమా మాట్లాడుతూ.. గత ఐదేళ్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఐసీయులో పెట్టిందని వైసీపీపై నిప్పులు చెరిగారు. 23 నెలల్లో రాష్ట్రానికి రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులతోపాటు 24 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా డబుల్ ఇంజన్ సర్కార్ కూటమి ప్రభుత్వం పరిగెడుతోందని పేర్కొన్నారు.
ఏపీకి ప్రతిష్టాత్మక కంపెనీలు వస్తుంటే .. వాస్తవాలు ఒప్పుకునే పరిస్థితిలో వైసీపీ లేదని వ్యంగ్యంగా అన్నారు. పోలవరం, ప్రజా రాజధాని అమరావతి పనులపై విషం చిమ్ముతున్నారంటూ వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. భోగాపురానికి ఎర్రబస్సు రాదన్నారు.. నేడు ఎయిర్ బస్సులు దిగబోతున్నాయని పేర్కొన్నారు.
8.8 కోట్ల మంది పేదల ఆకలిని అన్న క్యాంటీన్లు తీర్చాయని దేవినేని ఉమా గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వేల కిలోమీటర్లు రోడ్లు వేస్తుంటే.. ఐదేళ్లు రహదార్లపై గుంతలు పూడ్చలేని మీరు రోడ్లు గురించి మాట్లాడతారా? అంటూ వైసీపీ నేతలను మాజీ మంత్రి దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నారా దేవాన్ష్ యూట్యూబ్ చానల్ ‘డైనో డీట్స్’ ప్రారంభం.. స్పందించిన లోకేశ్
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒకే టికెట్పై..
For More AP News And Telugu News