రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అమరావతి నిర్మాణం: మంత్రి నారాయణ
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:09 PM
రైతులకు ఇచ్చిన మాట ప్రకారమే రాజధాని అమరావతిని నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు.
అమరావతి, మార్చి16: రైతులకు ఇచ్చిన మాట ప్రకారమే రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. సోమవారం రాజధాని అమరావతిలో హెచ్ఓడీ (HOD) టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. టవర్ -1కు మొదటి స్టీల్ డయాగ్రిడ్ను అమర్చే పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమరావతిలో జీఏడీ, హెచ్ఓడీలకు మొత్తం 5 టవర్లు డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్నామని తెలిపారు.
జీఏడీ టవర్ మొత్తం 47 అంతస్తులతో మిగిలిన టవర్లు 40 అంతస్తులతో నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు. మొత్తం 53 లక్షల చదరపు అడుగు బిల్డ్ ఏరియాతో ఈ ఐదు టవర్ల నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. అధికార యంత్రాంగం మొత్తం ఒకేచోట ఉండేలా ఈ టవర్ల నిర్మాణం ప్లాన్ చేశామన్నారు. ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఒకే చోట అన్ని కార్యాలయాలు ఉండేలా డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు.
2028 అక్టోబర్ నాటికి అన్ని టవర్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చిందని తెలిపారు. ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లతోపాటు ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు సైతం ప్రారంభమయ్యాయన్నారు. రాజధాని అమరావతిలో డయాగ్రిడ్ విధానంలో ఐదు ఐకానిక్ భవనాలను ప్రభుత్వం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒత్తిడికి గురికావద్దు.. పరీక్షలు ప్రశాంతంగా రాయండి: మంత్రి నారా లోకేశ్
ఒడిశాలోని కటక్ SCB హాస్పిటల్లో భారీ అగ్నిప్రమాదం, పది మంది మృతి
For More AP News And Telugu News