ఏఐ సమ్మిట్ను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Apr 04 , 2026 | 07:35 PM
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వైపు ఐటీ రంగం వేగంగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీనికి అనుగుణంగా మన మానవ వనరులకు తగిన శిక్షణ ఇవ్వడం చాలా అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. అమరావతి రీజియన్లో ఏఐ సమ్మిట్ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు.
అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వైపు ఐటీ రంగం వేగంగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీనికి అనుగుణంగా మన మానవ వనరులకు తగిన శిక్షణ ఇవ్వడం చాలా అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. అమరావతి రీజియన్లో ఏఐ సమ్మిట్ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. కృత్రిమ మేధపై అవగాహన పెంచేందుకు, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం, ఎస్టీపీఐ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కెరీర్ పట్ల స్పష్టత, టెక్నాలజీకి అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవడంపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో వస్తున్న మార్పులు, భవిష్యత్ తరాలకు అందించాల్సిన శిక్షణపై ఈరోజు వర్క్షాప్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు అమరావతి, విజయవాడలో ఈ నాలుగో సదస్సును నిర్వహిస్తున్నాం. గతంలో విశాఖపట్నంలో రెండు సార్లు, కాకినాడలో ఒకసారి ఈ కార్యక్రమాలు జరిగాయి. 25 ఏళ్ల కిందట సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల ఐటీ రంగంలో తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. హైదరాబాద్ ఒక మహానగరంగా అభివృద్ధి చెందింది. విశాఖపట్నంలో డేటా సెంటర్లు ఏర్పాటు కాబోతున్నాయి.
ఇప్పటికే మూడు గిగావాట్ల డేటా సెంటర్స్ కోసం ఒప్పందాలు జరిగాయి. మరో 3 గిగావాట్లు పైప్లైన్లో ఉన్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇనిషియేటివ్ను అమరావతిలో ప్రారంభించడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరోస్థాయికి తీసుకెళ్తుంది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా.. సుమారు రూ.6.5 లక్షల మందికి ఉపాధి లభించింది. ఉత్తరాంధ్రకి గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి సంస్థలు వచ్చాయి. రాయలసీమలోనూ ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ రంగాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలబెట్టడమే మా లక్ష్యం' అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
మాచర్ల అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్..
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్పై ఢిల్లీ ఘన విజయం