Share News

ఏపీలో పెరగనున్న వర్షాలు

ABN , Publish Date - Aug 01 , 2026 | 09:10 AM

నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలి రెండు నెలలు రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం నెలకొన్న పరిస్థితులు ఆగస్టు నెలలో కొంతవరకు మెరుగుపడనున్నాయి. ఈనెలలో ఉత్తర, దక్షిణకోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదుకానున్నది.

ఏపీలో పెరగనున్న వర్షాలు
AP Rainfall

ఆగస్టులో పలుచోట్ల సాధారణం, అంతకంటే ఎక్కువ: వాతావరణ శాఖ వెల్లడి

విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలి రెండు నెలలు రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం నెలకొన్న పరిస్థితులు ఆగస్టు నెలలో కొంతవరకు మెరుగుపడనున్నాయి. ఈనెలలో ఉత్తర, దక్షిణకోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదుకానున్నది. ఈ మేరకు శుక్రవారం భారత వాతావరణ శాఖ విడుదలచేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఆగస్టు, సెప్టెంబరు నెలలకు కలిపి వర్షపాతం, ఉష్ణోగ్రతల వివరాలు వెల్లడించింది. ఈ బులెటిన్‌ ప్రకారం ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు, కాకినాడ, కోనసీమ, దక్షిణ కోస్తాలో ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో తిరుపతి, చిత్తూరు, కడప, నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువగా, మిగిలిన ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది.


అదే సమయంలో విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. రుతుపవనాల సీజన్‌లో రెండో సగం అంటే ఆగస్టు, సెప్టెంబరు నెలలు కలిపి చూస్తే ఏపీలో కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాలు, శ్రీకాకుళం, విజయనగరంలో తక్కువ ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువగా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనావేసింది. నైరుతి సీజన్‌లో మొదటి రెండు నెలల్లో రాష్ట్రంలో 52 శాతం లోటు వర్షపాతం నమోదుతో తీవ్ర దుర్భిక్షం నెలకొంది.

Updated Date - Aug 01 , 2026 | 09:10 AM