ఏపీ ఓటరు జాబితా ముసాయిదా విడుదల.. 89.22 శాతం మంది ఫారాలు సమర్పించారు: సీఈవో
ABN , Publish Date - Jul 31 , 2026 | 02:39 PM
రాష్ట్రంలో 3.71 కోట్ల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారని ఏపీ ఎన్నికల సంఘం సీఈవో వివేక్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం రాజధాని అమరావతిలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎస్ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితాను ఆయన విడుదల చేశారు.
అమరావతి, జులై 31: రాష్ట్రంలో 3.71 కోట్ల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారని ఏపీ ఎన్నికల సంఘం సీఈవో వివేక్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం రాజధాని అమరావతిలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎస్ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితాను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈవో వివేక్ యాదవ్ మాట్లాడారు. ఈ ముసాయిదా జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) నెట్ యాప్, సీఈవో వెబ్సైట్లలో పరిశీలించ వచ్చునని ఓటర్లకు ఆయన సూచించారు.
మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్ల ఉన్నారని.. వారిలో 89.22% మంది ఫారాలు సమర్పించారని ఆయన తెలిపారు. అయితే 15.22 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు గుర్తించామని వివరించారు. 22.30 లక్షల మంది శాశ్వత చిరునామా మారినట్లు లేదా గైర్హాజరైనట్లు కనుగొన్నామని చెప్పారు. 7.37 లక్షల మంది ఓటర్ల పేర్లు రెండు, మూడు చోట్ల నమోదయ్యాయని పేర్కొన్నారు.
ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్న వారి పేరు ఒకే చోట కొనసాగేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. నిజమైన ఓటర్లు ఫారం-6తో మళ్లీ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్తోపాటు అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు.
అక్టోబర్ 3వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని సీఈవో వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. నోటీసు, విచారణ లేకుండా ఏ ఓటరు పేరును తొలగించబోమని ఈ సందర్బంగా వెల్లడించారు. అర్హులెవరు మిస్ కాకుండా, అనర్హులు చేరకుండా పారదర్శక ప్రక్రియకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని సీఈవో వివేక్ యాదవ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న స్కూటీ.. ఒకరి మృతి
19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల రద్దు.. నామినేటెడ్ సభ్యుల తొలగింపు
Read Latest AP News And Telugu News