రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం
ABN , Publish Date - Jun 29 , 2026 | 08:46 AM
త్వరలో ప్రారంభం కానున్న విబి జీ- రాం జీ పనుల్లోనూ రైతుకి మేలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
అమరావతి, జూన్ 29: జ్యేష్ఠ పౌర్ణమి నేడు (సోమవారం). ఈ నేపథ్యంలో అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. భూమాతను, పశుసంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పే వ్యవసాయ పండుగ.. ఏరువాక పున్నమి అని ఆయన అభివర్ణించారు. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులంతా ఆనందోత్సాహాల మధ్య నేల తల్లికి ప్రణమిల్లి కొత్త సాగుకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా యావత్ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల లోగిళ్లు పంటలు, సిరిసంపదలతో తులతూగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఇప్పటికే తొలి విడత పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసి రైతాంగం పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటుకున్నామని వివరించారు.
త్వరలో ప్రారంభం కానున్న విబి జీ- రాం జీ పనుల్లోనూ రైతుకి మేలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రైతులకు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా రైతులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రక్షాళనకు అడ్డుపడితే మూసీలో వేసి తొక్కుతాం..
For More AP News And Telugu News