అమరావతి అభివృద్ధిపై ఫోకస్.. నేడు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం
ABN , Publish Date - Apr 10 , 2026 | 08:35 AM
ఏపీ క్యాబినెట్ నేడు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణంపై ముఖ్యంగా చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ నేడు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధంగా ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి క్యాబినెట్ కృతజ్ఞతలు తెలపనుంది.
ఇక పెట్టుబడుల అంశంలో భాగంగా, 16వ ఎస్ఐపీబీ (State Investment Promotion Board) సమావేశంలో చర్చించిన ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.39,436 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతో పాటు, ఉపాధి అవకాశాలను కూడా పెంచనున్నాయి.
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ కింద మూడు ప్రముఖ సంస్థల స్థాపనకు కూడా క్యాబినెట్ అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే విద్యా రంగానికి సంబంధించి ఫీజు రెగ్యులేటరీ కమిటీ (FRC) ఏర్పాటు కోసం ఆర్డినెన్స్కు కూడా ఆమోదం తెలపనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనున్న క్యాబినెట్.. పలు సంస్థలకు భూ కేటాయింపులకు అమోదం తెలపనుంది. అదే విధంగా, రాష్ట్రంలో 28 జిల్లాల ఆధారంగా జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశంపై కూడా చర్చ జరగనుంది. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు, మల్టీ జోనల్ వ్యవస్థ అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తూ.గో. జిల్లాలో గవర్నర్ పర్యటన
ఇదిలా ఉంటే.. నేడు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.
Also Read:
నా ఖాతాలో 7 లక్షల కోట్లు ఉన్నాయ్..!
‘ఉగ్ర’ కేసును మాకు అప్పగించండి
For More Latest News