పెద్దపులి గాండ్రింపులు.. ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్థులు..
ABN , Publish Date - Feb 06 , 2026 | 05:01 PM
తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రాయవరం మండలం కూర్మాపురంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి పెద్దపుల్లి దూరినట్లు అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు.
తూర్పు గోదావరి జిల్లా, ఫిబ్రవరి 6: వారం రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపులి (Tiger) సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. రోజుకో ప్రాంతంలో కనిపిస్తూ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పులి తాజాగా రాయవరం మండలం కూర్మాపురంలోకి ప్రవేశించింది. పొలాల నుంచి ఇళ్ల వైపు వచ్చిన పెద్దపులి.. గ్రామంలోని ఒక పాడుబడిన ఇంట్లోకి దూరినట్లు స్థానికులు అటవీశాఖకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం నుంచీ పులి గాండ్రింపులు వినిపిస్తున్నట్లు అధికారులకు గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది.
సమాచారం అందిన వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పుణే నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్తో కలిసి పులిని సురక్షితంగా బంధించేందుకు ఆపరేషన్ చేపట్టారు. మత్తు ఇంజెక్షన్ గన్లను సిద్ధం చేసి, బోనులు ఏర్పాటు చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పులి భయంతో గ్రామస్తులు చాలామంది ఇళ్లపైకి ఎక్కి పరిస్థితిని గమనిస్తున్నారు. పులిని బంధించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేసుకున్నారు. అంతకుముందు, కూర్మాపురంలో వరి పొలంలో పులిని చూసిన సత్తిబాబు అనే వ్యక్తి భయంతో పరుగులు తీశాడు. పులి భయంతో కింద పడిపోవడంతో సత్తిబాబుకు గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి...
రాజమండ్రిలో పులి కదలికలు.. అటవీశాఖ అధికారి ఏం చెప్పారంటే?
లిక్కర్ స్కామ్ నిందితుడి ఆస్తుల అటాచ్.. ప్రభుత్వం ఆదేశం
Read Latest AP News And Telugu News