రాజమండ్రిలో పులి కదలికలు.. అటవీశాఖ అధికారి ఏం చెప్పారంటే?
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:34 PM
రాజమండ్రిలో పులి కదలికలపై జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకర్ కీలక ప్రకటన విడుదల చేశారు. పులి లైవ్ లొకేషన్ను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ.. పులి జాడలు ఎక్కడా లభించలేదని అధికారి తెలిపారు.
రాజమండ్రి, ఫిబ్రవరి 6: రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి కదలికలపై జిల్లా అటవీ శాఖ అధికారి ప్రభాకర్ రావు ముఖ్య ప్రకటన విడుదల చేశారు. గురువారం రాత్రి థర్మల్ డ్రోన్ల సాయంతో పులి లైవ్ లొకేషన్ను గుర్తించేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ.. పులి జాడలు ఎక్కడా లభించలేదని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం జి.ఎర్రంపాలెం గ్రామ శివార్లలో చివరిసారిగా పులి పాదముద్రలు లభించిన ప్రాంతంలో అటవీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని చెప్పారు.
పులి లైవ్ లొకేషన్ గుర్తించిన వెంటనే అదనపు పోలీస్ బలగాల సాయం అవసరం అవుతుందని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ఇప్పటికే కేసవరం పంచాయతీ పరిధిలో పోలీస్ బలగాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. పులి కదలికల ఆధారంగా.. మండపేట పరిసర ప్రాంతాలవైపు వెళ్లినట్టు తెలుస్తోందన్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు. రైతులు తమ ఆవులు, పశువులను ఇంటి వద్దే ఉంచుకోవాలని సూచించారు.
రైతులు.. రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా అటవీ శాఖ అధికారి ప్రభాకర్ రావు కోరారు. ఇదిలా ఉండగా.. పుణే నుంచి ఒక నిపుణుల బృందం ఇప్పటికే జిల్లాకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఈ రోజు మరో ప్రత్యేక బృందం కూడా రానుందన్నారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు భయపడకుండా, అధికారుల సూచనలను కచ్చితంగా పాటించాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో ఎన్హెచ్ నెట్వర్క్ అభివృద్ధికి నిరంతర నిధులు.. గడ్కరీకి థ్యాంక్స్ చెప్పిన సీఎం
విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసులో కీలక మలుపు.. లాస్ట్ కాల్ ఆధారంగా..
Read Latest AP News And Telugu News