కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
ABN , Publish Date - May 16 , 2026 | 11:47 AM
కాకినాడ రూరల్ మండల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అమరావతి: కాకినాడ రూరల్ మండల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా ఉపాధి హామీ శ్రామికులు మృతి చెందడం బాధాకరమని అన్నారు. చీడిగ గ్రామానికి చెందిన ఆరుగురు మహిళా శ్రామికులు రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్పారని డిప్యూటీ సీఎం తెలిపారు.
పని ప్రదేశంలో ఇలాంటి విషాదకర ఘటన జరగడం తీవ్రంగా కలచివేసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు వెల్లడించారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని చెప్పారు. మృతి చెందిన శ్రామికుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం పెంచిన పరిహారం రూ.4 లక్షలను త్వరితగతిన అందజేస్తామని తెలిపారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల సహాయంతో పాటు పీఎం సురక్ష యోజన, పీఎం జీవన్ జ్యోతి యోజన కింద లభించే బీమా మొత్తాన్ని కూడా అందిస్తామని పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రహదారుల పక్కన జరుగుతున్న ఉపాధి పనుల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జాతీయ రహదారులు, బైపాస్ రోడ్లు, ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనాల వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం
గోల్డ్, సిల్వర్ రేట్స్ పతనం.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News