‘గోదావరి ఉధృతి పెరుగుతోంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండండి’: కోనసీమ కలెక్టర్
ABN , Publish Date - Jul 31 , 2026 | 04:20 PM
గోదావరి వరదలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. రాత్రికి ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు.
కోనసీమ, జులై 31: గోదావరి వరదలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. నేటి(శుక్రవారం) రాత్రికి ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. సుమారు 10 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే, రేపు సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. సుమారు 13 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల ఉండొచ్చని అంచనా వేశారు.
జిల్లాలోని 19 మండలాలపై వరద ప్రభావం ఉందని కలెక్టర్ వెల్లడించారు. సెంట్రల్ డెల్టా పరిధిలోని 16 - 17 మండలాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 32 లంక గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. బోట్లు, లైఫ్ జాకెట్లు, సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయని, వరద ప్రభావం నేపథ్యంలో జిల్లా అధికారుల సెలవులను మూడు, నాలుగు రోజుల పాటు రద్దు చేసినట్లు తెలిపారు. నీటిమట్టం అంతకంతకూ పెరుగుతున్నందున గోదావరిలోకి ఎవరూ దిగవద్దని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పడవ ప్రయాణాలపై తాత్కాలిక ఆంక్షలు విధించామని, ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల రద్దు.. నామినేటెడ్ సభ్యుల తొలగింపు
‘టేకాఫ్కు సిద్ధం.. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం మోదీ జీ’: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News