కాంగ్రెస్ హయాంలో స్కాములు.. మోదీ హయాంలో అభివృద్ధి: ప్రహ్లాద్ జోషి
ABN , Publish Date - Jun 09 , 2026 | 03:45 PM
దేశ క్షేమం కోసం ఆపరేషన్ సిందూర్ లాంటి కీలక నిర్ణయాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేశారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. నేటితో ప్రధానిగా మోదీ 4399 రోజులు పూర్తి చేసుకున్న రోజు అని ప్రస్తావించారు.
తిరుపతి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): దేశ క్షేమం కోసం ఆపరేషన్ సిందూర్ లాంటి కీలక నిర్ణయాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) అమలు చేశారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) వ్యాఖ్యానించారు. నేటితో ప్రధానిగా మోదీ 4399 రోజులు పూర్తి చేసుకున్న రోజు అని ప్రస్తావించారు. ఈరోజు (మంగళవారం) తిరుపతిలో ప్రహ్లాద్ జోషి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో కూటమి రెండేళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. జవాహర్ లాల్ నెహ్రూ ఇప్పటివరకు అత్యధిక రోజులు ప్రధానిగా ఉన్న రికార్డు ఉందని గుర్తుచేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ మాత్రమే సుస్థిర ప్రభుత్వం ఇస్తోందనే రోజులు ఉండేవని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో స్కాములు మాత్రమే ఉండేవని ఆరోపించారు. మోదీ హయాంలో దేశంలో అభివృద్ధి జరుగుతోందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో రూ.6 లక్షల కోట్లు స్కాములు..
కాంగ్రెస్ హయాంలో గతంలో రూ.6 లక్షల కోట్ల స్కాములు జరిగాయని ప్రహ్లాద్ జోషి ప్రస్తావించారు. స్కిల్, స్కేల్, ఈ రోజు ఎన్ని సమస్యలు ఉన్నా.. అత్యంత వేగంగా ఆర్థిక ఎదుగుదల సాధిస్తున్న దేశం మనదని చెప్పుకొచ్చారు. 25 కోట్ల మంది భారతీయులు మల్టీ డైమెన్షనల్గా రూపుదిద్దుకుంటున్నారని వెల్లడించారు. 81 కోట్ల మందికి ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. ఆహార సరఫరా జియో ట్యాగింగ్ చేసే పైలెట్ ప్రాజెక్ట్ ఏపీలో జరుగుతోందని తెలిపారు. కోట్లాది మందికి జన్ ధన్ అకౌంట్లు ప్రారంభించడంతో డిజిటల్ ట్రాన్స్క్షన్ పెరిగిందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
ఉపాధి కల్పన పెరిగింది..
లక్షలాది కిలోమీటర్ల నేషనల్ హైవేలతో ఉపాధి కల్పన పెరిగిందని ప్రహ్లాద్ జోషి వివరించారు. విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్న రెండో దేశం మనదని చెప్పారు. తాము సన్ (SUN) పవర్తో ముందుకెళ్తున్నామని.. కాంగ్రెస్ సన్ (SON) కోసం పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. పవర్ సర్ ప్లస్లో భారత్ ముందంజలో ఉందని చెప్పుకొచ్చారు. దేశంలో మొబైల్స్ వినియోగం 160 టైమ్స్ పెరిగిందని వివరించారు. ఎల్పీజీ గ్యాస్ ఉత్పత్తి దేశంలో జరగదని... గ్యాస్ సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా కేంద్రం చర్యలు చేపడుతోందని తెలిపారు. సగం రోజులు ఇండియాలో.. మిగిలిన రోజులు విదేశాల్లో ఉండేవారే ‘సర్’(SIR)కు భయపడుతున్నారని ప్రహ్లాద్ జోషి విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సమావేశం.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News