తిరుమలలో డాక్టర్ కావ్య కమల్ నృత్యాభిషేకం
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:27 PM
తిరుమలలో నాద నీరాజనం వేదికగా డాక్టర్ కావ్య కమల్ మన్యపు నృత్యం పలువురిని ఆకట్టుకుంది. ఒకవైపు నాసా శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తూనే.. భరతనాట్యంపై మక్కువతో ఆమె నృత్యాభిషేకం చేశారు.
తిరుమల, ఫిబ్రవరి 22: డాక్టర్ కావ్య కమల్ మన్యపు.. ఆమెకు ఊహ తెలిసినప్పటి నుంచే భరతనాట్యమంటే ఎంతో ఇష్టం. ఇంటర్ పూర్తైన తర్వాత భారత్ను వదిలిపెట్టి అమెరికాకు వెళ్లినా.. చిన్నతనంలో నేర్చుకున్న నాట్యాన్ని మాత్రం ఆమె మరువలేదు. ఓవైపు నృత్యం నేర్చుకుంటునే కెరీర్పై దృష్టి సారించారు.

తన లక్ష్యమైన నాసా స్పేస్ సైంటిస్ట్గా బాధ్యతలు చేపట్టారు కావ్య కమల్. మరోవైపు భరతనాట్యంలోనూ డిప్లొమా పూర్తిచేసి అనేక ప్రదర్శనలతో పేరు ప్రఖ్యాతలు పొందారీ హైదరాబాదీ వాసి. మంజుల రామస్వామి, వీఎస్ రామమూర్తి వద్ద ఆమె నృత్యం నేర్చుకున్నారు.

1999లోనే నాటి భారత రాష్ట్రపతి కేఆర్.నారాయణన్ చేతులు మీదుగా ‘బాలశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు డాక్టర్ కావ్య కమల్ మన్యపు. అమెరికాలోనూ డాక్టర్ రత్నకుమార్ వద్ద శిక్షణ పొంది తన నాట్యానికి మరింత మెరుగులు దిద్దుకున్నారామె.

సుమారు 19 ఏళ్లుగా కీలకమైన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే తనకెంతో ఇష్టమైన నృత్యాన్నీ ఆమె కొనసాగిస్తున్నారు. కాగా శ్రీవారిపై ఎంతో భక్తి కలిగిన ఆమె డాక్టర్ సృష్టి భూదూరి, సింధు రామచంద్రన్తో కలిసి తిరుమలలోని నాద నీరాజనం వేదికపై ప్రదర్శన ఇచ్చి భక్తులను ఆకట్టుకున్నారు కావ్య కమల్.

త్రిదేవస్తుతి, బ్రహ్మ కడిగిన పాదం, దశావతారం, రాజీవ నేత్రాయా, విశ్వమా కరణ, నన్ను బ్రోవ, భూపాలం తిల్లాన తదితర కీర్తనలకు వివిధ రకాల నృత్య రీతులతో పాటు అద్భుత హావభావాలతో ప్రేక్షకుల మనసును దోచుకున్నారు డాక్టర్ కావ్య కమల్ మన్యపు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు నివాసం వద్ద హైటెన్షన్..
For More AP News And Telugu News