ప్రాథమిక పాఠశాల వంట గదిలో అగ్నిప్రమాదం..
ABN , Publish Date - Mar 11 , 2026 | 06:25 PM
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని అడవి బూదుగురు ప్రాథమిక పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల వంటగదిలో అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.
చిత్తూరు జిల్లా, మార్చి11: కుప్పం(Kuppam) మండలంలోని అడవి బూదుగురు ప్రాథమిక పాఠశాలలో ఇవాళ(బుధవారం) పెను ప్రమాదం తప్పింది. పాఠశాల వంటగదిలో అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో కొద్దిసేపు పాఠశాల ప్రాంగణంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉపాధ్యాయులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
బుధవారం మధ్యాహ్న వంటగదిలో ఉన్న విద్యుత్ వైర్లలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో వంటగదిలో ఉన్న పాత్రలు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే వంటగది పైకప్పు కూడా మంటల్లో కాలిపోయింది. అగ్నిప్రమాదాన్ని(Fire Accident) గమనించిన ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమై తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులను బయటకు పంపించారు. విద్యార్థులను సురక్షిత ప్రదేశానికి తరలించి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ సమయంలో పాఠశాలలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు కూడా సహకరించారు. స్థానిక గ్రామస్తుల సహాయంతో ఉపాధ్యాయులు వంటగది బయట నుంచి నీటితో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనపై స్థానిక అధికారులు సమాచారం తెలుసుకుని విచారణ ప్రారంభించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పాఠశాలలో భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి:
తల్లికి, చెల్లికి లేని రక్షణ.. రాష్ట్ర మహిళలకు ఇస్తారా? జగన్పై టీడీపీ ఎంపి ధ్వజం
జగన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్