Share News

సబ్‌సీ కేబుల్‌ హబ్‌గా ఏపీ

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:17 AM

ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ల నిర్మాణం ఊపందుకుంది. ఈ డేటా సెంటర్లను ప్రపంచంతో అనుసంధానించడానికి సముద్రగర్భ (సబ్‌సీ) కేబుళ్ల ఏర్పాటు కూడా కీలకం కానుంది. దీంతో సబ్‌సీ కేబుల్‌ కనెక్టివిటీకి మన రాష్ట్రం హబ్‌గా అవతరిస్తోంది.

సబ్‌సీ కేబుల్‌ హబ్‌గా ఏపీ

  • రాష్ట్రంలో కొత్తగా కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్లు

  • ప్రపంచంతో డేటా సెంటర్ల కనెక్టివిటీకి కీలకం

  • విశాఖలో మైక్రోసాఫ్ట్‌ కన్సార్షియం, గూగుల్‌ స్టేషన్లు

  • అమెరికాతో అనుసంధానానికి గూగుల్‌,

  • ఆగ్నేయాసియాతో కనెక్టివిటీకి మైక్రోసాఫ్ట్‌ కేబుల్స్‌

  • 2029 నాటికి గూగుల్‌ కేబుల్‌ వ్యవస్థ సిద్ధం

(అమరావతి- ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ల నిర్మాణం ఊపందుకుంది. ఈ డేటా సెంటర్లను ప్రపంచంతో అనుసంధానించడానికి సముద్రగర్భ (సబ్‌సీ) కేబుళ్ల ఏర్పాటు కూడా కీలకం కానుంది. దీంతో సబ్‌సీ కేబుల్‌ కనెక్టివిటీకి మన రాష్ట్రం హబ్‌గా అవతరిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్‌ మౌలిక సదుపాయాలు మన దేశంలో ప్రధానంగా ముంబై, చెన్నైల్లో ఎక్కువగా ఉన్నాయి. త్వరలో ఏపీ తీరంలో కొత్త కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానంగా రెండు కీలక ప్రాజెక్టులు నడుస్తున్నాయి. 3,600 కి.మీల ‘ఇండియా-సౌత్‌ఈస్ట్ ఆసియా’ (ఐ-2ఎస్ఈఏ) సబ్‌మెరైన్‌ కేబుల్‌ సిస్టమ్‌ను ల్యాండ్‌ చేయడానికి లైట్‌స్టార్మ్‌, సింగపూర్‌కు చెందిన టెల్కో సింగ్‌టెల్‌ వంటి సంస్థలతో కూడిన కన్సార్షియంలో మైక్రోసాఫ్ట్‌ భాగస్వామిగా ఉంది. మరోవైపు గూగుల్‌ ప్రపంచవ్యాప్త ‘అమెరికా-ఇండియా కనెక్ట్‌’ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇవి రెండూ విశాఖపట్నంలో ల్యాండ్‌ అవుతాయి. విశాఖలోనే గూగుల్‌ డేటా సెంటర్‌ కాంప్లెక్స్‌ నిర్మించనుంది. ఏఐ హబ్‌లో భాగంగా... తాము విశాఖపట్నం సమీప తీరంలో ల్యాండ్‌ అయ్యేలా సబ్‌సీ కేబుళ్లను తీసుకువస్తున్నామని గూగుల్‌ ఆసియా పసిఫిక్‌ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల ఎగ్జిక్యూటివ్‌ అలెగ్జాండర్‌ స్మిత్‌ తెలిపారు.


దేశంలో ముంబై, చెన్నైల తర్వాత విశాఖపట్నం ఆగ్నేయాసియాతో అనుసంధానమయ్యే మూడో డిజిటల్‌ అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వేని కలిగి ఉంటుంది. దీని ద్వారా సింగపూర్‌, ఇతర ప్రధాన మార్కెట్లు, అలాగే ఆస్ట్రేలియా, పశ్చిమాసియా, యూరప్‌ తదితర ప్రాంతాలకు కనెక్టివిటీ లభిస్తుంది. ఈ పరిణామాలు విశాఖపట్నాన్ని ప్రపంచంలోనే అత్యంత అనుసంధానిత (కనెక్టెడ్‌) ప్రదేశాలలో ఒకటిగా మారుస్తుందని స్మిత్‌ తెలిపారు. విశాఖపట్నంలో గూగుల్‌ కేంద్రం ప్రధానంగా పునరుత్పాదక ఇంధనశక్తిపై పనిచేస్తుందని చెప్పారు. ప్రపంచంలో పునరుత్పాదక శక్తిని కొనుగోలు చేసే అతిపెద్ద సంస్థలలో గూగుల్‌ ఒకటని, అలాగే ఈ కేంద్రలో ఎయిర్‌-కూలింగ్‌ సాంకేతికతతో నీటి వినియోగాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గిస్తామని ఆయన తెలిపారు. ఐ-2ఎ్‌సఈఏ కేబుల్‌ ఆగ్నేయాసియాను ప్రత్యేకంగా సింగపూర్‌, మలేషియాలను భారత తూర్పు తీరానికి కలుపుతుంది. ఈ కేబుల్‌ వ్యవస్థ 2029 నాలుగో త్రైమాసికంలో సేవలకు సిద్ధంగా ఉంటుందని అంచనా. పశ్చిమాసియాలో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నందున భారతదేశపు తూర్పు తీరానికి సబ్‌సీ కేబుళ్ల ల్యాండింగ్‌కు డిమాండ్‌ పెరిగింది. కొత్తగా ఏర్పడే ఈ డిజిటల్‌ కనెక్టివిటీ దేశంలోని కొన్ని ప్రధాన మెట్రో నగరాలను కలుపుతుంది. విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్ల పైభాగంలో నిర్మించే భూతల ఫైబర్‌ ఆధారంగా, లైట్‌స్టార్మ్‌ ఒకే బ్యాండ్‌విడ్త్‌తో మచిలీపట్నం నుంచి ముంబై, హైదరాబాద్‌లను, అలాగే చెన్నై నుంచి హైదరాబాద్‌, ముంబైలను కలిపే టెరెస్ట్రియల్‌ కారిడార్‌ను నిర్మించే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఢిల్లీ-బిలాస్‌పూర్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

ఈ ఇంటి కాంట్రాక్టర్‌కు దండం పెట్టొచ్చు..

Updated Date - Aug 29 , 2026 | 04:17 AM