Ramchander Rao: నివేదిక అసెంబ్లీకి వచ్చాకే కాళేశ్వరంపై స్పందిస్తాం
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:42 AM
కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టకముందే కాంగ్రెస్ లీకులు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలి
రైతులను ముంచిన బీఆర్ఎస్, కాంగ్రెస్
రాష్ట్రంలో యూరియా కొరత లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
పెద్దపల్లి/మంచిర్యాల/హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టకముందే కాంగ్రెస్ లీకులు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో బహిర్గతం చేసిన తర్వాతనే తాము స్పందిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం పెద్దపల్లిలో జరిగిన బీజేపీ కార్యకర్తల జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జరిగిన రైతు సమ్మేళనంలో రాంచందర్రావు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతలో డొల్లతనాన్ని గతంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు బయటపెట్టారని, దీనిపై సీబీఐ విచారణ కోరాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియాను బ్లాక్ చేస్తూ కొరత సృష్టిస్తోందని ఆరోపించారు. 9 లక్షల టన్నుల డిమాండ్కుగాను కేంద్రం తెలంగాణకు 12 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసిందని తెలిపారు. రైతులకు మాయ మాటలు చెప్పి నట్టేట ముంచింది టీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. పదేళ్లలో రైతు బీమా, రుణ మాఫీ పేరుతో కాలం వెళ్లదీసిందని విమర్శించారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేక, రైతు భరోసా సరిగా ఇవ్వలేక సీఎం రేవంత్రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎ్సకు రైతులు బుద్ధి చెప్పాలని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న బీజేపీకి మద్దతు పలకాలని రాంచందర్రావు కోరారు.
8న సిట్ విచారణకు సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ నెల 8న సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు సిట్ అధికారులకు సంజయ్ లేఖ రాశారు. సంజయ్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా విచారణకు హాజరవుతారు. ఫోన్ ట్యాపింగ్పై సంజయ్కి కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే కీలక సమాచారం, ఆధారాలను అందజేశాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
హోంమంత్రిగా అమిత్షా రికార్డు
కేంద్ర హోం మంత్రిగా సుదీర్ఘకాలం(ఇప్పటికి 2,258 రోజులు) పనిచేసిన నేతగా అమిత్షా చరిత్ర సృష్టించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా అమిత్ షా పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో, అమిత్షా మార్గదర్శకంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని సంజయ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
కేసీఆర్ ఇచ్చిన టాస్క్ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్
Read latest Telangana News And Telugu News