Ponnam Prabhakar: బీసీల నోటి కాడి ముద్ద లాక్కోకండి
ABN , Publish Date - Jul 12 , 2025 | 03:53 AM
కాంగ్రెస్ బీసీ నాయకులం అందరమూ చేతులు జోడించి వేడుకుంటున్నాం. బీసీల నోటికాడి ముద్ద లాక్కోకండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ సర్కారు తీసుకువస్తున్న..
చేతులు జోడించి వేడుకుంటున్నాం.. ‘స్థానికం’లో 42ు రిజర్వేషన్కు మద్దతు ఇవ్వండి
బీఆర్ఎస్, బీజేపీలకు పొన్నం విజ్ఞప్తి
ఆర్డినెన్స్కు కవచంలా నిలబడాలంటూ కాంగ్రెస్ బీసీ నేతలకు పిలుపు
ఆర్డినెన్సుకు ఎవరూ అడ్డు పడొద్దు: కేకే
హైదరాబాద్/న్యూఢిల్లీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రెస్ బీసీ నాయకులం అందరమూ చేతులు జోడించి వేడుకుంటున్నాం. బీసీల నోటికాడి ముద్ద లాక్కోకండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ సర్కారు తీసుకువస్తున్న ఆర్డినెన్స్కు మద్దతు ఇవ్వండి’ అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి.. సొంత పార్టీల్లో వ్యతిరేకతను తెచ్చుకోవద్దని హితవు పలికారు. శుక్రవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు (కేకే), ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఇతర బీసీ నేతలతో కలిసి పొన్నం మాట్లాడారు. కులగణన సర్వే నివేదిక ఆధారంగా బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రెండు బిల్లులను ఆమోదించి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించామని గుర్తు చేశారు. బీజేపీ తెలంగాణ నేతలు.. ప్రధాని మోదీని కలిసి ఆ రెండు బిల్లులనూ ఆమోదించేలా చూడాలని కోరారు. బీసీలకు సీఎం పదవి ఇస్తామని ప్రకటించిన బీజేపీ.. కీలక సమయంలో బీసీ నేత బండి సంజయ్ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిందని పొన్నం విమర్శించారు. ‘తెలంగాణలో బీజేపీకి చెందిన నలుగురు బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యే రాజాసింగ్ను కాదని అగ్రవర్ణానికి చెందిన రామచందర్రావుకు అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. రాజాసింగ్ రాజీనామానూ ఆమోదించారు. బీజేపీ.. బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని దీంతోనే తేలిపోయింది. సామాజిక న్యాయం కాంగ్రె్సతోనే సాధ్యం. కాంగ్రె్సలో సీఎం రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారైతే.. టీపీసీసీ చీఫ్.. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే 18 నెలలు జాప్యమైంది. కాంగ్రెస్ బీసీ నేతలు.. కుల సంఘాల జేఏసీగా ఏర్పడి ఆర్డినెన్సుకు ఉక్కు కవచంలా నిలబడి ముందుకు సాగాలి’ అని పిలుపునిచ్చారు. కేకే మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేవలం పార్టీలకు సంబంధించినదే కాదని, సమానత్వంలో ఇదీ ఒక భాగమని చెప్పారు. దయచేసి ఆర్డినెన్సుకు ఎవరూ అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేశారు. బీసీల విషయంలో రాజకీయం చేయడం తగదని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు.
మంది పెళ్లిళ్ల దగ్గర కవిత మంగళహారతులు: ఆది శ్రీనివాస్

మంది పెళ్లిళ్ల కాడ మంగళహారతులు పట్టడం.. కవిత ఆపేయాలంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీల కోసం పోరాటం చేయని ఆమె.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి.. రంగులు పూసుకుని సంబరాలు చేసుకుంటోందన్నారు. ఢిల్లీలోని తెలంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కవితకు బీసీ బిల్లుతో ఏం సంబంధమని ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీ రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. ఇకనైనా బీసీలపై మొసలి కన్నీరు ఆపాలని హితబోధ చేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులపై కేంద్రం ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోనందునే.. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వస్తోందని ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్ తీసుకురావాలన్న క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. దీన్ని స్వాగతించి.. బీసీలపైన ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు సూచించారు.
బీసీలకు వరం: బీర్ల అయిలయ్య

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం బీసీలకు ఒక వరమని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు సీఎం రేవంత్రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆయన ఆలోచన మేరకే రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ జరిగాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రె్సతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు.
ఊళ్లో పెళ్లికి కవిత హడావుడి ఏంటో?: ఇందిరా శోభన్

ఊళ్లో పెళ్లికి కవిత హడావుడి ఏంటో అర్థం కావట్లేదని కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ అన్నారు. కాంగ్రెస్ సర్కారు ఘనతను ఆమె తన ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయపడుతున్నారన్నారు. ఆనాడు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ 22శాతానికి తగ్గించినప్పుడు కవిత ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు.
మార్గదర్శకుడు సీఎం రేవంత్: మల్లు రవి

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడంలో సీఎం రేవంత్రెడ్డి మార్గదర్శకుడిగా నిలిచారని టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి కొనియాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు భవిష్యత్తులో తెలంగాణ నమూనాను అనుసరించాల్సి వస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మళ్లీ ఈ అవకాశం రాదు: షబ్బీర్ అలీ
బీసీలంటే కేసీఆర్కు చులకన అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. తాము కేసీఆర్లాగా కాదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఆర్డినెన్సును తెస్తోందని చెప్పారు. మళ్లీ ఇలాంటి అవకాశం రాదని, రాష్ట్రంలోని బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ.. బీసీ డిక్లరేషన్ను తన నియోజకవర్గం కామారెడ్డిలో చేయడం సంతోషకరమన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన దరిద్రపు ప్రభుత్వం.. కేసీఆర్దేనని మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!
అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు
For Telangana News And Telugu News